5 May, 2026 | 3:46 AM

రాజస్థాన్ ఫ్రాంచైజీ అమ్మకంపై వివాదం

05-05-2026 02:31 AM

న్యాయపోరాటానికి సిద్ధమవుతున్న కాల్ సోమానీ

న్యూయార్క్, మే 4: ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ అమ్మకంపై వివాదం నెలకొంది. లీగ్ చరిత్రలోనే అత్యంత ఖరీదైనదిగా భావిస్తున్న ఈ డీల్ ఇప్పుడు చిక్కుల్లో పడింది. ఫ్రాంచైజీ కొనుగోలు చేసేందుకు మొదటి నుంచీ తీవ్రప్రయత్నాలు చేసిన కాల్ సోమానీ కన్సార్టియం బీసీసీఐపై న్యాయపోరాటానికి సిద్ధమవుతోంది.

ఇటీవల మిట్టల్ కుటుంబం, అదర్ పూనావాలా సుమారు 15,660 కోట్లకు ఈ ఫ్రాంచైజీని కొనుగోలు చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా జరగలేదని ఆరోపిస్తూ కాల్ సోమానీ నేతృత్వంలోని కన్సార్టియం ఇప్పుడు చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతోంది. దీంతో ఈ మెగా డీల్ కోర్టు పరిధిలోకి వెళ్లే అవకాశం కనిపిస్తోంది.

ఓ నివేదిక ప్రకారం ఈ డీల్ ముగింపు దశలో జరిగిన పరిణామాలపై సోమానీ గ్రూప్ తీవ్ర అసంతృప్తితో ఉంది. వాస్తవానికి అమెరికాకు చెందిన వాల్మార్ట్ వారసుడు రాబ్ వాల్టన్ వంటి అంతర్జాతీయ పెట్టుబడిదారులతో కూడిన సోమానీ కన్సార్టియం.. రాజస్థాన్ రాయల్స్‌ను కొనుగోలు చేసే విషయంలో ముందువరుసలో నిలిచింది. దాదాపు రూ. 15,300 కోట్లకు బిడ్ కూడా వేసినట్టు తెలుస్తోంది. పలు కారణాలతో ఈ డీల్ ముందుకు సాగలేదు.

ఆ కారణాలు వెల్లడించకుండా తమను పక్కన పెట్టి వేరే వారితో డీల్ కుదుర్చుకోవడంపై కాల్ సోమానీ కన్సార్టియం మండిపడుతోంది. త్వరలోనే దీనిపై ఫ్రాంచైజీకి లీగల్ నోటీసులు పంపనున్నట్లు ఆ గ్రూప్ వర్గాలు వెల్లడించాయి. తాము సకాలంలో నిధులు చెల్లించలేకపోయామన్న వార్తలను సోమానీ గ్రూప్ ఖండించింది. తాము గత 10 రోజులుగా డీల్ ముగించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది. కానీ ఫ్రాంచైజీ యాజమాన్యం కావాలనే ఆలస్యం చేస్తూ ఇతరులతో చర్చలు జరిపిందని ఆరోపిస్తోంది. అలాగే బకాయిలు, పెండింగ్‌లో ఉన్న న్యాయపరమైన కేసులు, భవిష్యత్తు నిర్వహణపై తాము అడిగిన ప్రశ్నలకు స్పష్టత ఇవ్వకుండానే ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతోంది.