మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం
అలంపూర్, నవంబర్ 23: అలంపూర్ పరిధిలోని ఉండవల్లి మండలం అలంపూర్ చౌరస్తా వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆదివారం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే విజయుడు, మార్కెట్ కమిటీ చైర్మన్ బింగిదొడ్డి దొడ్డప్పతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని అన్నారు. రైతులకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఈ సందర్భంగా తెలిపారు.
అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ దొడ్డప్ప మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ఉద్దేశంతో ప్రతి రైతు నష్టపోకుండా ప్రభుత్వం నిర్ణయించిన ధరకు రైతులు ధాన్యాన్ని అమ్ముకొని లబ్ధి చేకూరాలని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రజా పాలనలో ప్రభుత్వం కల్పిస్తుంది అని తెలిపారు. కాబట్టి రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ పచ్చర్ల కుమార్, కలుగొట్ల పిఎసిఎస్ చైర్మన్ ఉయ్యాలవాడ గజేందర్ రెడ్డి, మార్క్ ఫెడ్ డిఎం చంద్రమౌళి, జిల్లా మార్కెటింగ్ అధికారి పుష్ప, సెక్రటరీ ఎల్లస్వామి, నరసింహ నాయకులు, కిషోర్ , శ్రీకాంత్, బుక్కాపురం లక్ష్మణ్ రెడ్డి ఇతరులు పాల్గొన్నారు.




