15 April, 2026 | 7:23 AM

జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి

29-10-2025 05:53 PM

మొక్కజొన్న పండించిన రైతులు దళారులకు తక్కువ ధరకు కాకుండా ప్రభుత్వ మద్దతు ధరకు అమ్ముకోవాలి

అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎన్ ఖీమ్య నాయక్

వనపర్తి టౌన్: వనపర్తి జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలని అదనపు కలెక్టర్ ఎన్. ఖీమ్యా నాయక్ మార్క్ ఫెడ్ అధికారిని ఆదేశించారు. వనపర్తి జిల్లాలో 10958 ఎకరాలలో రైతులు మొక్కజొన్న పంట సాగుచేయడం జరిగిందని, ఇప్పటికే మొక్కజొన్న హార్వెస్టింగ్ ప్రారంభమైనందున రైతులకు ఇబ్బందులు కాకుండా వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం క్వింటాలుకు రూ.2400 మద్దతు ధర ప్రకటించిందని, మద్దతు ధరకు ఏమాత్రం తగ్గకుండా రైతులు తమ పంటను లాభసాటిగా అమ్ముకోవాలని సూచించారు.

జిల్లాలో సహకార సంఘాల ద్వారా చిట్యాల, గోపాల్పేట, చిన్నంబావిలలో ఒక్కోక్కటి చొప్పున (3) మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. మొక్కజొన్న తేమ 14 శాతానికి మించకుండ కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు.  వనపర్తి జిల్లాలో 10958 ఎకరాల్లో మొక్క జొన్న పంట సాగు చేయగా దాదాపు 2,73,800 క్వింటాళ్లు దిగుబడి అయి కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. అత్యధికంగా చిన్నంబావి మండలంలో 7492 ఎకరాల్లో మొక్క జొన్న పంట సాగు చేయడం జరిగిందన్నారు. పంట అమ్మడంలో ఏమైనా ఇబ్బందులు ఏర్పడితే మార్క్ ఫెడ్ అధికారి చంద్రమౌళి కాంటాక్ట్ నెంబర్ 9989804756 కు సంప్రదించాలని సూచించారు. జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు, మార్క్ ఫెడ్ అధికారి చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.