22-06-2025 09:47:58 PM
గర్భిణీ స్త్రీలకు కాలం చెల్లిన మందులు అంటగడుతున్న వైనం..
నిలదీసిన బాధితునికి ఇంకో మూడు నెలలైనా ఏమీ కావని డాక్టర్ ఉచిత సలహా..
వనపర్తి (విజయక్రాంతి): పెబ్బేరు పట్టణంలోని రాఘవేంద్ర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్(Raghavendra Multi Speciality Hospital) కాలం చెల్లిన మందులు ఇచ్చినట్లు బాధితుడు గణేష్ ఆదివారం ఆసుపత్రి ముందు ధర్నాకు దిగారు. వివరాల్లోకి వెళితే... సూగూర్ గ్రామానికి చెందిన పల్లవి ప్రస్తుతం తొమ్మిది నెలల నిండు గర్భిణీ. ప్రతి నెలా క్రమం తప్పకుండా స్థానిక రాఘవేంద్ర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో డాక్టర్ రాఘవేంద్ర రెడ్డితో చెకప్ చేయించుకుని, అదే ఆసుపత్రి ఫార్మాలో మందులు కొనేవాడని తెలిపాడు.
గత నెలలో రక్తం, ఐరన్ లోపం కోసం టాబ్లెట్స్ ఇచ్చారు. అవి అప్పటికే నెలముందు కాలం చెల్లినవిగా ఆలస్యంగా బాధితుడు గుర్తించారు. గతవారం ఆసుపత్రికి వచ్చి టాబ్లెట్స్ కాలం చెల్లినవిగా ఉన్నాయని డాక్టర్ దృష్టికి తీసుకువెళ్లగా తిరిగి వేరే టాబ్లెట్స్ మార్చి ఇచ్చారని అవి కూడా కాలం చెల్లినవి ఉండటంతో తరువాత ఎవరినైనా పంపించండి కొత్త టాబ్లెట్స్ ఇస్తామని ఆసుపత్రి వర్గాలు నమ్మబలికాయి.
తరువాత కొత్త టాబ్లెట్స్ అని పంపినవి కూడా కాలంచెల్లినవి కావటూ వైద్యులు ఉచిత సలహా ఇచ్చారాని అని బాధితుడు ఆరోపించారు. ఆదివారం ఆసుపత్రికి వచ్చి డాక్టర్ ను నిలదీయగా పొంతన లేని సమాధానం చెబుతున్నారని అన్నారు. మెడికల్ షాప్ లో కట్టలు కట్టలుగా కాలం చెల్లిన మందులు ఉండటంపై అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇదే ఆసుపత్రికి దాదాపుగా నెలకు చాలా మంది గర్భిణీ స్త్రీలు నెలవారీ మందులకు టెస్టులకు వస్తుంటారని వారికి కూడా కాలం చెల్లిన ఐరన్, కాల్షియం టాబ్లెట్స్ పంపిణీ చేసారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇట్టి విషయంపై జిల్లా ఔషద నియంత్రణ అధికారికి ఫోన్ చేయగా తమ దృష్టికి వచ్చిందని ఒకసారి వెళ్లి పరిశీలిస్తామని తెలిపారు.