09-06-2025 05:36:36 PM
కలెక్టర్ కుమార్ దీపక్ కి ఫిర్యాదు..
అర్హులకు అన్యాయం..
అనర్హులకు షాపుల కేటాయింపు..
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): బెల్లంపల్లి కూరగాయల మార్కెట్ సముదాయం షెటర్ల కేటాయింపుల్లో అవినీతి జరిగిందని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ వర్గం బృందం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్(District Collector Kumar Deepak)కి ఫిర్యాదు చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి. బెల్లంపల్లి కూరగాయల మార్కెట్ నూతన భవన సముదాయంలోని షెటర్ రూముల కేటాయింపుల్లో పెద్ద ఎత్తున అవినీతి భాగోతం చోటుచేసుకుందనీ ఫిర్యాదుదారులు ఆరోపించారు. కూరగాయల మార్కెట్ నూతన భవన సముదాయంలో గల షెటర్ రూములను లబ్దిదారులకి లాటరీ పద్ధతిలో ఎంపిక చేయడం జరిగింది. ఇట్టి షెటర్ రూముల లబ్దిదారుల ఎంపికలో పూర్తిగా అవకతవకలు జరిగాయి.
పూర్వము ఈ మార్కెట్ లో ఎలాంటి వ్యాపారము చేయని వారు, మార్కెట్ కి సంబంధం లేని వ్యక్తుల పేర్లు లబ్దిదారుల జాబితాలో చేర్చారు. అట్టి పేర్ల విషయం, లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగినందువలన నిజమైన లబ్దిదారులకు తీరని అన్యాయం జరిగిందనీ వాపోయారు. సంబంధం లేని వ్యక్తులను లబ్దిదారుల జాబితాలో చేర్చడంతో నిజమైన లబ్దిదారులకు రావాల్సిన వరుస క్రమంలో షాపులు కాకుండా మార్కెట్లో ఓ మూలన లభించాయనీ, ఇలా కూడా స్థానిక వ్యాపారులకు అన్యాయం జరిగిందనీ తెలిపారు.వ్యాపారులుగా ఎంపికైన వారిలో అనర్హులే ఎక్కువగా ఉన్నారనీ వెల్లడించారు.
కూరగాయల మార్కెట్ భవన నిర్మాణం పూర్తి అయిన తరువాత ప్రకటించిన మొదటి, రెండవ జాబితాలో లేని పేర్లు తుది జాబితాలోకి ఎలా చేరాయనీ మున్సిపల్ సిబ్బంది తీరుపై విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో మార్కెట్ కు అసలు సంబంధం లేని వ్యక్తుల ఎంపిక, అవినీతిపై నిజ నిర్ధారణ కమిటీ వేసి నిజమైన లబ్దిదారులకు న్యాయం చేయాలని కోరారు. బెల్లంపల్లి మున్సిపల్ అధికారులు ఎంపిక చేసిన జాబితాలో మార్కెట్ కు సంబంధం లేని గంధం సౌజన్య, పోచంపల్లి యశోద, అజ్మీర దేవి బాయ్, శివరాం నాయక్, తోకల మౌనిక పేర్లు ఉన్నాయని తెలిపారు.
ఈ ఆదుగురికి ఏ అర్హత లేకున్నా కేటాయించారు. ఈ కేటాయింపుల్లో అవినీతికి ఇంతకంటే సాక్ష్యం మరొకటి లేదనీ స్పష్టం చేశారు. ఈ అవినీతి పాల్పడిన బెల్లంపల్లి మున్సిపాలిటీ అధికారులపై చట్టరీత్య చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కుమార్ దీపక్ విన్నవించారు. మార్కెట్ షాపుల కేటాయింపులో అవినీతి, అర్హులకు అన్యాయంపై జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కు ఫిర్యాదు జేసిన వారిలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండి అఫ్జల్, కాంగ్రెస్ నాయకులు, దేవసాని ఆనంద్, ఆడెపు మహేష్,తిప్పని రాయమల్లు, రాచకొండ గోవర్ధనరావు, మాజీ కౌన్సిలర్లు బైరి శ్రీనివాస్, పొట్ల సురేష్ ఉన్నారు.