14-06-2025 05:37:59 PM
వర్షం రాకతో రైతుల్లో ఆనందం..
టేకులపల్లి, (విజయక్రాంతి): రెండు రోజుల క్రితం కురిసిన భారీ వర్షం రైతులకు వరంగా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District) టేకులపల్లి మండలంలో రైతులు రెండు రోజులుగా పత్తి విత్తనాలు జోరుగా విత్తుతున్నారు. ఇప్పటికే వేసవిలో దుక్కులు సిద్ధం చేకొని పొడి దుక్కుల్లో పత్తి విత్తనాలు విత్తిన రైతులు కురిసిన వర్షానికి మొలకెత్తుతాయని ఎదురు చూస్తున్నారు. వేసవి దుక్కులు చేయని రైతులు వర్షం కురియగానే దుక్కులు సిద్ధం చేసుకొని రెండు రోజులుగా పత్తి విత్తనాలు విత్తడంలో నిమగ్నమయ్యారు. ఒక్కమారుగా రైతులందరూ, పత్తి విత్తనాలు విత్తుతునడంతో అటు దుంనేందుకు ట్రాక్టర్లు, కూలీలా కొరత తీవ్రంగా ఏర్పడింది.
గత రెండేళ్లుగా మిరప పంట వేసి రూ. లక్షల్లో పెట్టుబడి పెట్టి ఒక ఏడాది దిగుబడిరాక, మరో ఏడాది పంట పండినా, ధర పలుకక పోవడంతో ఈ ఏడాది రైతులు ఎక్కువ మంది పత్తి పంటపైనే మొగ్గు చూపుతున్నారు. దీనితో పత్తి విత్తనాలకు డిమాండ్ పెరిగింది. వ్యాపారాలు కూడా పోటీ పది విత్తనాల సంచుల ధరలు తగ్గించి అమ్ముతుండటంతో పలు అనుమానాలకు దారి తీస్తుంది. కొందరు వ్యాపారాలు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు అమ్ముతుండగా, కొందరు మాత్రం రైతు అడిగిన విత్తనం ఇవ్వకుండా తక్కువ ధర పేరుతొ మోసం చేస్తున్నారు. అధికారులు ఈ వ్యవహారం పై ద్రుష్టి సారించాలని పలువురు అంటున్నారు. మొత్తం మీద ఈ ఏడాది జూన్ నెల రైతులకు అనుకూలంగానే ఉందని, అందుకు అనుగుణంగా అదనులోనే విత్తనాలు వేస్తున్నామని రైతులు అంటున్నారు.