12-11-2025 12:00:00 AM
మహబూబాబాద్, నవంబర్ 11 (విజయక్రాంతి) : భారత కమ్యూనిస్టు పార్టీ వందేళ్ల పండుగను ఘనంగా నిర్వహించడానికి పార్టీ శ్రేణులు కృషి చేయాలని సీపీఐ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి విజయ సారధి పిలుపునిచ్చారు. సీపీఐ, ఏఐటీయూసీ ఉమ్మడి పట్టణ సమావేశం స్థానిక వీరభవన్లో తోట రాజకుమారి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా విజయసారథి మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ వందేళ్ల పండుగను ఖమ్మంలో డిసెంబర్ 26న 5 లక్షల మందితో నిర్వహించనున్నట్లు చెప్పారు.
శతాబ్ది బహిరంగ సభ జయప్రదానికై సీపీఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో నవంబర్ 20న మహబూబాబాద్ జిల్లాకు బస్సుజాత వస్తుందని, ఆరోజు జిల్లా కేంద్రంలో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బి.అజయ్ సారధి రెడ్డి, పెరుగు కుమార్, దేశపల్లి నవీన్, చింతకుంట్ల వెంకన్న, వీరవెల్లి రవి, తోట రాజకుమారి, కేదాసు రమేష్, అజ్మీర వేణు, వంకాయలపాటి చిరంజీవి, సీపీఐ, ఏఐటీయూసీ నేతలు కార్మికులు పాల్గొన్నారు.