పెట్రోలింగ్, బ్లూ కోల్డ్స్ వాహనాలతో సంచరిస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి
- సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి*
- టేకులపల్లి పోలీస్ స్టేషన్ ను సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
టేకులపల్లి, (విజయక్రాంతి): జిల్లా ఎస్పీ రోహిత్ రాజు టేకులపల్లి పోలీస్ స్టేషన్ ను శనివారం సందర్శించారు. ఇల్లందు డిఎస్పి వెంకన్న బాబు జిల్లా ఎస్పీ కి స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తించే సిబ్బంది నుండి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. అనంతరం అక్కడ ఉన్న పోలీస్ అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వివిధ సమస్యలతో పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులకు న్యాయం చేకూర్చే విధంగా బాధ్యతగా మెలగాలని సూచించారు. అనంతరం పోలీస్ స్టేషన్లోని రికార్డులను పరిశీలించారు.
పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పలు కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. అక్రమ ఇసుక రవాణా పై ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేసి, అక్రమ ఇసుక రవాణాపై ఉక్కు పాదం మోపాలని ఆదేశాలు జారీ చేశారు. మట్కా, జూదం, కోడి పందాలు, పేకాట, బెట్టింగ్, గంజాయి రవాణా వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా నిత్యం పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. పెట్రోలింగ్, బ్లూ కోల్ట్స్ వాహనాలతో సంచరిస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. పోలీస్ స్టేషన్లో పనిచేసే అధికారులు, సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.






