2 April, 2026 | 2:48 AM

అధిక వడ్డీ ఆశచూపి 30 కోట్లు వసూలు

02-04-2026 01:27 AM
  1. నిందితులను అరెస్టు చేసిన నాగోల్ పోలీసులు

వీరభద్ర ట్రేడింగ్ పేరుతో కార్యాలయం ప్రారంభం 

ఎల్బీనగర్, ఏప్రిల్ 1 : నెలకు భారీ వడ్డీ ఆశ చూపిస్తూ పెట్టుబడిదారులను వలలో వేసి కోట్ల రూపాయలు కాజేసిన ముగ్గురు మోసగాళ్లను నాగోల్ పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేశారు. సుమారు 290 మంది నుంచి రూ.30 కోట్ల వరకు వసూలు చేసి మోసానికి పాల్పడిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెట్టుబడుల పేరుతో ప్రజలను ఆకర్షించి భారీ ఆర్థిక మోసానికి పాల్పడిన సంఘటన నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

నాగోల్ సీఐ మహమ్మద్ మక్బూల్ జాన్ తెలిపిన వివరాల ప్రకారం.. నాగోల్ పరిధిలోని బండ్ల గూడ ఆనంద్ నగర్కు చెందిన కిచ్చ వీరభద్రరావు(51) తన భార్య రాజ్యలక్ష్మి, సహాయ కుడు వెంకట దుర్గాప్రసాద్తో కలిసి నాగోల్ డివిజన్లోని కో-ఆపరేటివ్ బ్యాంక్ కాలనీ, రోడ్ నెంబర్ 13లో 2024 జూన్లో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని వీరభద్ర ట్రేడింగ్ పేరుతో కార్యాలయం ప్రారంభించారు.

ఈ సంస్థలో లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టినవారికి నెలకు రూ.10 వేల చొప్పున వడ్డీ చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో ప్రజలు ఆకర్షితు లయ్యారు. ఈ క్రమంలో సుమారు 290 మంది వినియోగదారులు రూ.30 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టినట్లు పోలీసులు తెలిపారు. మొదట్లో కొంతమందికి వడ్డీ చెల్లిస్తూ నమ్మకం కల్పించిన నిందితులు, 2025 మే నెలలో గుర్గాంలో వీరభద్రరావుపై సైబర్ క్రైమ్ కేసు నమోదు కావడంతో ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డారు.

అప్పుల భారం తో రూ.30 కోట్లలో రూ.15 కోట్లు మాత్రమే తిరిగి చెల్లించి, మిగతా రూ.15 కోట్ల చెల్లింపులను నిలిపివేశారు. దీంతో మోసపో యామ ని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించగా, వారి ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.