02-06-2025 12:30:31 AM
హుస్నాబాద్, జూన్ 1 : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని చారిత్రక ఎల్లమ్మ జాతర వైభవంగా సాగుతోంది. ఆదివారం ఆలయం భక్తులతో కిటకిటలాడింది. సెలవుదినం కావడంతో వేలాదిగా తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారికి ఓడిబియ్యం సమర్పించి, బోనం మొక్కులు చెల్లించారు.
కొందరు పట్నాలు వేసి, బంధుమిత్రులతో కలిసి ఆలయ ప్రాంగణంలోని చెట్ల కింద సామూహిక భోజనాలు చేశారు. ఈ సందర్భంగా బైండ్ల పంబాల వారు అమ్మవారి కథను వినిపించి భక్తులను అలరించారు. జాతర సందర్భంగా ఎటువంటి అవాంతరాలు తలెత్తకుండా పోలీస్ శాఖ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. శాంతిభద్రతలను పర్యవేక్షిస్తూ, భక్తులను క్రమబద్ధంగా దర్శనం అయ్యేలా చూశారు.