09-10-2025 12:21:33 AM
పటాన్చెరు, అక్టోబర్ 8: ఈజీ మనీ కోసం విద్యావంతులు సైతం సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడుతున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో ఉంటున్న ఐటీ ఉద్యోగి ఒకరు ఏకంగా రూ.54.67 లక్షలు మోసపోయిన ఘటన వెలుగులోకి వచ్చింది. బ్రాం డెడ్ వస్తువులకు రేటింగ్ ఇస్తే భారీ కమీషన్ ఇస్తామని నమ్మబలకడంతో ఐటీ ఉద్యోగి నిలువునా మోసపోయాడు. గత సెప్టెంబర్ 15న తన సెల్ఫోన్కు ఓ నంబర్ ద్వారా ఎస్ఎంఎస్ వచ్చింది.
కొన్ని బ్రాండ్లకు రేటింగ్ ఇవ్వాలని నమ్మబలికి, టెలిగ్రాం లింక్ పంపారు. దాని ద్వారా లాగిన్ చేయగా కొన్ని బ్రాండ్లకు రేటింగ్ ఇచ్చి పెట్టుబడి పెడితే కమీషన్ ఇస్తామని సైబర్ నేరగాళ్లు నమ్మించారు. దీంతో ముందుగా రూ.5 వేలు చెల్లించిన బాధితుడికి రూ. 12,500 అతడి ఖాతాలో వేశారు. తర్వాత తన అకౌంట్ స్కోర్ను తగ్గించి ఇందుకోసం రూ.5 లక్షలు వేయాలని చెప్పడంతో ఆ డబ్బులు వేశాడు.
ఇలా విడతల వారీగా మొత్తంగా రూ.54.67 లక్ష లు సైబర్ నేరగాళ్ల ఖాతాలో వేయించుకున్నారు. ఇందుకు రూ.70 లక్షలు తిరిగి చెల్లిస్తామని సైబర్నేరగాళ్లు నమ్మించారు. విత్ డ్రా కోసం బాధి తుడు ప్రయత్నించగా మరో రూ.8 లక్షలు అకౌంట్లో వేయాలని నేరగాళ్లు చెప్పడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ హెల్ప్లైన్కి కాల్ చేసి ఫిర్యాదు చేశాడు.