20-12-2025 12:36:50 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 19 (విజయక్రాంతి): దేశ ఆర్థిక వ్యవస్థను, సామాన్యుల కష్టార్జితాన్ని కొల్లగొడుతున్న సైబర్ నేరగాళ్లకు చెక్ పెట్టాలంటే ప్రస్తుత బ్యాంకింగ్ నిబంధనల్లో సమూల మార్పులు అనివార్యమని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ స్పష్టం చేశారు. సైబర్ నేరాలకు ఆక్సిజన్లుగా మారిన మ్యూ ల్ ఖాతాల నియంత్రణలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరింత కఠినంగా వ్యవహరించాలని కోరారు.
శుక్రవారం హైదరా బాద్లోని ఆర్బీఐ కార్యాలయంలో గవర్నర్ సంజయ్ మల్హోత్రాతో సీపీ సజ్జనార్ నేతృత్వంలోని ఉన్నతాధికారుల బృందం ప్రత్యేకంగా భేటీ అయింది.ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ఖాతాలు తెరిచే సమయంలో బ్యాంకు సిబ్బంది పాటించాల్సిన నిబంధనలను కఠినతరం చేయాలని సీపీ కోరారు. సైబర్ నేరం జరిగిన వెంటనే బాధితుల సొమ్ము ను కాపాడాలన్నా, నేరగాళ్లను పట్టుకోవాలన్నా బ్యాంకుల నుంచి సత్వర స్పందన ఉండాలని సీపీ కోరారు.
అలాగే పాం జీ స్కీమ్లపై ఉక్కుపాదం మో పాలన్నారు. సీపీ సజ్జనార్ లేవనెత్తిన అంశాలు, సమర్పించిన మూడు వేర్వేరు లేఖలపై ఆర్బీ ఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సానుకూలంగా స్పందించారు. సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో అదనపు సీపీ క్రైమ్స్ ఎం.శ్రీనివాసులు, సీసీఎస్ డీసీపీ శ్వేత, సైబర్ క్రైమ్స్ డీసీపీ అరవింద్ బాబు తదితరులు పాల్గొన్నారు.