29-05-2025 10:37:08 PM
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి..
హనుమకొండ (విజయక్రాంతి): గురువారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో పరకాల మహిళా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార సంఘాల సమితి మహాజన సభను నిర్వహించారు. ఈ సమావేశంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి(MLA Revuri Prakash Reddy) మాట్లాడుతూ... మహిళా డెయిరీ ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చినప్పటి నుంచి రెండు జిల్లాల కలెక్టర్ల దృష్టికి తీసుకువెళ్లగా, ప్రారంభం నుండి అంచనాకు మించి కోఆర్డినేట్ చేస్తున్నారని అన్నారు. మహిళా డెయిరీ ఏర్పాటుకు కృషి చేస్తున్న రెండు జిల్లాల, సంబంధిత శాఖల అధికారులకు అభినందనలు తెలిపారు. మహిళలు ఆర్థికాభివృద్ధి చెందడం ద్వారా ఆ కుటుంబాలు ముందుకెళ్తాయన్నారు.
ములుకనూరు డెయిరీ మాదిరిగానే పరకాల మహిళా డెయిరీ కూడా రానున్న రోజుల్లో విజయవంతంగా నడవాలన్నారు. మహిళా డెయిరీ ఏర్పాటుతో మహిళలు అభివృద్ధి సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. పరకాల మహిళ పాల డెయిరీ ని విజయవంతంగా నిర్వహిస్తూ జిల్లాతో పాటు ఇతర జిల్లాలకు కూడా మార్గదర్శకంగా నిలవాలన్నారు. మహిళలు తమను తాము నిరూపించుకోవడానికి ఇదొక మంచి అవకాశం అని పేర్కొన్నారు. పాల డెయిరీ నిర్వహణకు పట్టుదలతో పని చేసి స్ఫూర్తిదాయకంగా నిలవాలన్నారు. పరకాల మహిళా డెయిరీ విజయవంతంగా నిర్వహించేందుకు కమిటీని ఏర్పాటు చేసుకోవాలన్నారు. డెయిరీ ఏర్పాటుకు జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ(ఎన్డిడి) సహకారం ఉంటుందన్నారు.
హనుమకొండ వరంగల్ జిల్లాల కలెక్టర్లు పి. ప్రావీణ్య, డాక్టర్. సత్య శారదలు మాట్లాడుతూ.. పాల డైరీ నిర్వహణను మహిళలు క్రమశిక్షణ అంకితభావంతో పనిచేయాలని, ప్రభుత్వం అందించే రుణాలను డైరీ సంబంధిత యూనిట్లకు ఎక్కువగా వినియోగించుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో హనుమకొండ వరంగల్ జిల్లాల గ్రామీణ అభివృద్ధి అధికారులు మేన శ్రీను, కౌసల్య దేవి, నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ అధికారులు లత, సుందర్ రావు, ఇతర అధికారులతో పాటు పరకాల మహిళా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార సంఘాల సమితి ప్రతినిధులు పాల్గొన్నారు.