27-06-2025 12:13:25 AM
గజ్వేల్ శివాలయ భూములు కబ్జాపై ఆర్డీవో కు బిజేపి నాయకుల ఫిర్యాదు
గజ్వేల్, జూన్ 25 : ఆలయాల భూముల జోలికి వస్తే ఉపేక్షించేది లేదని బిజెపి గజ్వేల్ పట్టణ అధ్యక్షుడు మనోహర్ యాదవ్ అన్నారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని సర్వే నంబర్ 338లో శివాలయానికి సంబంధించిన భూమిని ప్రభుత్వం తమకు కేటాయించిందని గజ్వేల్ చెందిన కొందరు వ్యక్తులు భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని, ఈ విషయంలో వెంటనే స్పందించాలని గజ్వేల్ ఆర్డిఓ, ఎమ్మార్వోలకు బిజెపి నాయకులు గురువారం వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా గజ్వేల్ పట్టణ బిజెపి అధ్యక్షులు దేవులపల్లి మనోహర్ యాదవ్, నాయకులు నాగు ముదిరాజ్ లు మాట్లాడుతూ గజ్వేల్ రామాలయ ప్రాంగణంలోని శివాలయానికి సంబంధించిన భూమి గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని సంగాపూర్ రోడ్ లోని సర్వే నంబర్ 338లో తొమ్మిది ఎకరాలకు పైగా ఉందన్నారు. గత ప్రభుత్వం కొంతమేర ఆ భూమిలో ప్రస్తుతం ఐఓసి ప్రభుత్వ కార్యాలయాన్ని నిర్మించిందని, మిగిలిన భూమి ప్రస్తుతం ఆ కార్యాలయం వెనకాల ఖాళీగా ఉందన్నారు.
ఆ భూమిని నష్టపరిహారం కింద ప్రభుత్వ అధికారులు కేటాయించినట్లు చెబుతూ పట్టణానికి చెందిన చెందిన కొందరు వ్యక్తులు భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అధికారులు శివాలయ భూమిని కాపాడాలని బిజెపి నాయకులు కోరారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పరిధిలో గతంలో జరిగిన అభివృద్ధిలో భాగంగా చాలామంది భూములు, ఇండ్లు కోల్పోయారని, దానికి తగిన నష్ట పరి హార నగదు రూపంలో ఇవ్వడం జరిగిందన్నారు. భూమికి బదులు భూమి ఎక్కడ ఇవ్వలేద న్నారు.
ప్రస్తుతానికి కోర్టు పరిధిలో, దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్న కోట్లు విలువ చేసే దేవాలయ భూమిని మాకు ఇచ్చారంటూ కొంతమంది కాగితాలు చూపించి కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని అని భారతీయ జనతా పార్టీ దృష్టికి రావడంతోనే భూమిని కాపాడాలని కోరుతు న్నట్లు తెలిపారు. గతంలో ప్రభుత్వం మారగానే కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారుల కన్ను పడిందని తెలియగానే బీజేపీ ఆధ్వర్యంలో పోరాటానికి దిగుతామని తెలియజేయగానే వెనుకడుగు వేసినట్లు గుర్తు చేశారు.
ఇప్పుడు కూడా బిజెపి దేవాదాయ భూమి పరిరక్షణ కోసం ఎట్టి పరిస్థితుల్లో వెనుకడుగు వేయదని తెలిపారు. ప్రైవేట్ వ్యక్తులకు ఎటువంటి కేటాయింపులు చేసినా గజ్వేల్ హిందువులందరినీ ఏకం చేసి పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ బిజెపి సీనియర్ నాయకులు ఉప్పల మధుసూదన్, మన్నేం శశిధర్ రెడ్డి, నత్తి శివకుమార్, సిల్వేరు జనార్ధన్ , చేప్యాల వెంకట్ రెడ్డి, నాగు ముదిరాజ్, భాస్కర్ రెడ్డి, పెండ్యాల శ్రీనివాస్, పట్టణ ప్రధాన కార్యదర్శిలు నాయిని సందీప్ కుమార్, మాడ్గురి నరసింహా ముదిరాజ్, మండల ప్రధాన కార్యదర్శులు బార్ అరవింద్, ఇప్ప స్వామి, నాయకులు హరి కుమార్, బాల రాజు, కాల్ల సాయి కుమార్, రాజేశ్వర్ చారి, ఎల్లం తదితరులు పాల్గొన్నారు.