calender_icon.png 1 June, 2025 | 11:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమానికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది

31-05-2025 01:19:28 PM

హైదరాబాద్: తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల రాజకీయ అధికారం కల్పించాలని కాంగ్రెస్ చిత్తశుద్ధితో ఉందన్నారు. ఖమ్మం జిల్లాలో మాత్రమే 5 నియోజకవర్గాలు రిజర్వ్ అయ్యాయని భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) తెలిపారు. దేశంలోని అన్ని రకాల వనరులను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇవ్వాలనేది కాంగ్రెస్ లక్ష్యమని ఆయన వెల్లడించారు. వెనుకబడిన వర్గాల వారు తలెత్తుకుని ఆత్మగౌరవంతో బతకాలనేది కాంగ్రెస్ లక్ష్యం అన్నారు. వెనకబడిన వర్గాలను దృష్టిలో పెట్టుకునే కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను రూపొందిస్తుందని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం భూ గరిష్ఠ పరిమితి చట్టం చేసిందని తెలిపారు.

భూమి లేని ఎస్సీ, ఎస్టీలకు భూములు పంపిణీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమేనని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6.70 లక్షల ఎకరాలను పేదలకు పంపిణీ చేసిందని వెల్లడించారు. పేదలకు పంచిన భూములను వారు దున్నుకోకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం(BRS Government) అడ్డుకున్నదని భట్టి విక్రమార్క ఆరోపించారు. గురుకుల విద్య సంస్థల్లో వసతుల కోసం భారీగా నిధులు కేటాయించామని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. గిరిజనుల కోసం ఇటీవల మరో పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది. గిరిజనుల భూమికి సాగునీటి కోసం ఇందిరాగాంధీ సౌర గిరిజల అనే పథకాన్ని చేపట్టామన్నారు. ఇందిరా సౌర గిరిజల పథకానికి రూ. 12.500 కోట్లు కేటాయించామని పేర్కొన్నారు. 2013లో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ను తీసుకువచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమేనని గుర్తుచేశారు.

ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్(SC, ST Sub-Plan)ను బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లపాటు గాలికి వదిలేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్ల పాటు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కు నిధులు ఇవ్వలేదు, ఉన్నవి ఖర్చు చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ సబ్ ప్లాన్ కు రూ. 17,169 కోట్లు కేటాయించిందని సూచించారు. కాంగ్రెస్ చేపట్టిన పథకాలను కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఇవాళ రాష్ట్రంలో 90 లక్షల కుటుంబాలకు సన్న బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తున్నామన్నారు. నూటికి నూరు శాతం గిరిజన కుటుంబాలకు ఉచిత విద్యుత్(Free electricity) ఇస్తున్నామని చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాపాల్వంచలో  తెలంగాణ కాంగ్రెస్ బునియాది ఆదివాసి కార్యకర్తల సమ్మేళనంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్ పాల్గొన్నారు. గురుకుల పాఠశాలలో మూడు రోజులుగా కార్యకర్తల సమ్మేళనం జరుగుతుంది. ముగింపు వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొని ప్రసంగించారు.