09-06-2025 10:29:59 PM
రాబోయే సంవత్సర కాలానికి గౌడ సంఘ కమ్యూనిటీ భవనం పూర్తి చేయాలి..
దేశానికి ఆదర్శంగా నిలిచేలా కుల సర్వే నిర్వహణ..
గౌడ సంఘ కమ్యూనిటీ హాల్ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం, రాష్ట్ర మంత్రులు పొన్నం, పొంగులేటి..
ఖమ్మం (విజయక్రాంతి): ప్రజా అవసరాలను ఎజెండాగా, చట్టాలుగా మార్చి పాలన చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు(Deputy CM Mallu Bhatti Vikramarka) అన్నారు. సోమవారం డిప్యూటీ సీఎం, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రివర్యులు భట్టి విక్రమార్క రాష్ట్ర బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar), రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి(Minister Ponguleti Srinivasa Reddy), ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి రఘునాథపాలెంలో నిర్మించనున్న గౌడ సంఘ కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసి, ఏర్పాటు చేసిన సభలో పాల్గొనీ జ్యోతి ప్రజ్వలన చేసి, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్ర పటానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు మాట్లాడుతూ... గతంలోని పెద్దలు ముందు చూపుతో రాష్ట్ర నలు వైపులా నుంచి వచ్చే పేద విద్యార్థుల కోసం హైదరాబాద్ హిమాయత్ నగర్ లో కట్టిన గౌడ హాస్టల్ అనేక మంది మేధావులను తయారు చేసిందని అన్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో అటువంటి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని ఇది భవిష్యత్తు తరాలకు చాలా ఉపయోగపడుతుందని అన్నారు. సర్వాయి పాపన్న గౌడ్ వరంగల్ కు 40 కిలో మీటర్ల దూరంలో ఉన్న చిన్న ఊరీలో సామాన్య కుటుంబంలో పుట్టి సమాజాన్ని ప్రభావితం చేసి రాజుగా పాపన్న గౌడ్ ఎదిగారని, గోల్కొండ కోటను కొల్లగొట్టి రాజుగా పాలించగలనని స్ఫూర్తిని అందించారని తెలిపారు.
బ్రిటిష్ చరిత్ర కారుడు సర్వాయి పాపన్న గౌడ్ చరిత్రను మనందరికి అందించారని తెలిపారు. నేడు రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం పాలన సాగుతుందని, ప్రజల అవసరాలను ఎజెండాగా, చట్టాలుగా మార్చి పాలన కొనసాగిస్తున్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. రాష్ట్రంలో ఉన్న వనరులు, సంపద అత్యంత వెనుకబడిన వర్గాల ప్రజలకు దామాషా పద్ధతిలో అందించాలని రాహుల్ గాంధీ ఆలోచన మేరకు మన తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రారంభించి, చిన్న పొరపాటు కూడా జరగకుండా కుల సర్వే అతి తక్కువ సమయంలో విజయవంతంగా పూర్తి చేశామని అన్నారు. అనంతరం మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ... ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో నేడు గౌడ సంఘ కమ్యూనిటీ భవన నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసుకున్నామని అన్నారు.
ఖమ్మం జిల్లాకు సంబంధించిన లోక్ సభ, రాజ్యసభ సభ్యులు, మంత్రులు పొంగులేటి, తుమ్మల చెరో 50 లక్షల రూపాయలు, ఉప ముఖ్యమంత్రి కోటి రూపాయలు గౌడ కమ్యూనిటీ భవనానికి మంజూరు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. గతంలో పార్లమెంట్ సభ్యునిగా ఉన్నప్పుడు గౌడ హాస్టల్ 6 కోట్ల రూపాయలతో నిర్మించామని, యాదగిరిగుట్ట దగ్గర 60 గదులతో గౌడ భవన్ ట్రస్ట్ నిర్మించిందని తెలిపారు. వేములవాడ ఆలయ సమీపంలో 45 రూములతో సత్రం నిర్మిస్తున్నామని, జోగులాంబ, కొమురవెల్లి ఆలయాల వద్ద స్థల సేకరణ జరుగుతుందని మంత్రి తెలిపారు. భద్రాచలం ఆలయం వద్ద కూడా గౌడ సత్రం నిర్మించేందుకు సహకరించాలని కోరారు.
కులవృత్తిని కాపాడుకోవడంతో పాటు పిల్లలను చదువు వైపు కూడా ప్రోత్సహించాలని, విద్య తోటే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అన్నారు. తాటి చెట్లు ఎక్కేవారి ప్రాణాల రక్షణ కల్పించేందుకు కాటమయ్య రక్షక కిట్ లనుపంపిణీ చేశామని మంత్రి గుర్తు చేశారు. వన మహోత్సవం కార్యక్రమం క్రింద ఆదాయం సమకూర్చే తాటి, ఈత, ఖర్జూర మొక్కలను నాటేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ప్రస్తుత సీజన్ లో 40 లక్షల ఈత మొక్కలు,5 లక్షల తాటి మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉన్నాయని వీటిని ప్రతి ఊరిలో ప్రభుత్వ స్థలంలో కాలువల వెంబడి పెద్ద ఎత్తున నాటాలని, నాటిన ప్రతి మొక్క సంరక్షణకు చర్యలు తీసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు.
అనంతరం మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ... గౌడ కమ్యూనిటీ భవన నిర్మాణం కార్యక్రమంలో తనను భాగస్వామ్యం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. గౌడ కమ్యూనిటీ భవనానికి పార్లమెంట్ సభ్యునిగా ఉన్నప్పుడు 10 లక్షలు ఇస్తానని మాట ఇచ్చానని, ఇప్పుడు ఐదు రెట్లు ఇవ్వమని కోరారని, తప్పకుండా అవసరమైతే అధికంగా కూడా తన తరఫున కేటాయించి పూర్తి చేసే బాధ్యత తీసుకుంటున్నట్లు మంత్రి ప్రకటించారు. అనంతరం ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ... మనం పుట్టిన కులాన్ని గౌరవించుకొంటు, ఇతర కులాలను ఎప్పుడు కించపరిచే విధంగా ప్రవర్తించడానికి వీలు లేదని అన్నారు.
పేద ప్రజలకు ఉపయోగపడే గౌడ సంఘ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నేడు నాంది పలకడం సంతోషంగా ఉందని అన్నారు. హైదరాబాద్ లో ఉన్న కొన్ని ఫంక్షన్ హాల్ లో వేడుకలు చూస్తే ఆశ్చర్యంగా ఉంటుందని, కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి వివాహ వేడుకలు జరుపుతున్నారని, పేద ప్రజలకు అతి తక్కువ ఖర్చుతో వివాహాం వంటి శుభకార్యాలు నిర్వహించుకునేందుకు వేదికగా ఉండేలా కమ్యూనిటీ హాల్స్ రాబోయే తరాలకు ఉపయోగ పడుతుందని అన్నారు. హిమాయత్ నగర్ లో ఉన్న గౌడ సంఘ భవనం నిర్మిస్తే నేడు మనకు ఉపయోగ పడుతుందని, అదేవిధంగా మనం నిర్మించే భవనం భవిష్యత్తు తరాలకు ఉపయోగ పడాలని అన్నారు. కులవృత్తులు అంతరించి పోకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. గౌడ వృత్తి చాలా కఠినమైన వృత్తి అని, ప్రతి రోజు సాహసోపేతంగా కుల వృత్తి నిర్వహిస్తారని తెలిపారు.
సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి మాట్లాడుతూ బీసీ వర్గాలకు పాలనలో సముచిత స్థానం కల్పించామని అన్నారు. రాబోయే రోజులలో బీసీలకు ప్రాతినిధ్యం కల్పించాలనే లక్ష్యంతో 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీలో నూతన చట్టం ప్రవేశ పెట్టామని అన్నారు. వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ మాట్లాడుతూ... గౌడ సంఘం సొసైటీలను తమ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేశామని అన్నారు. రాజకీయంగా బీసీలు ఎదిగేందుకు ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్లు కల్పించిందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర హ్యాండిక్రాఫ్ట్ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ నాయుడు సత్యనారాయణ గౌడ్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, తెలంగాణ రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షులు పల్లె లక్ష్మణ్ గౌడ్, గౌడ సంఘం రాష్ట్ర, జిల్లా ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.