15-01-2026 02:00:56 AM
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్
ఎల్లారెడ్డి, జనవరి 14 (విజయ క్రాంతి): ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలో రూ.2 కోట్ల నిధులతో చేపట్టనున్న వ్యవసాయ మార్కెట్ అభివృద్ధి కార్యక్రమాలకు ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్ శంకుస్థా పన చేశారు. ఈ నిధులతో వ్యవసాయ మార్కెట్లో నూతన భవనం నిర్మాణం, మరుగుదొడ్ల ఏర్పాటు, ప్రహరీ మరమ్మతులు, అలాగే వాణిజ్య సముదాయం నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఎల్లారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..
సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని రైతులకు శుభాకాంక్షలు తెలిపారు. రైతులకు సన్న వడ్లకు క్వింటాకు రూ.500/- బోనస్ విడుదల చేసినట్లు వెల్లడించారు. ఇది రైతులకు పెద్ద ఊరటగా నిలుస్తుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు చేయలేని అనేక అభివృద్ధి పనులను తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వేగంగా అమలు చేస్తున్నామని తెలిపారు. తన నాయకత్వంలో కొత్త బస్ స్టాండ్, సెంట్రల్ లైటింగ్, నూతన రోడ్లు, డ్రైనేజీలు, పెద్ద చెరువు సుందరీకరణ, పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, అర్హులైన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని వివరించారు.
ప్రజలకు అందుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. అభివృద్ధే తమ జవాబు, ప్రజలే తమ బలమని స్పష్టం చేశారు. ఎల్లారెడ్డి నియోజక వర్గాన్ని తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలిపేందుకు తాము ఎప్పటికీ కట్టుబడి ఉంటామని ఎమ్మెల్యే తెలిపారు. ఎల్లారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జొన్నలగడ్డ రాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, వెంకట్ రాంరెడ్డి, డైరెక్టర్లు గంగారెడ్డి శంకరయ్య,వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి శ్రీనివాస్, సిబ్బంది శశిధర్, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.