ఆరోగ్యవంతమైన సమాజంతోనే అభివృద్ధి
ఉత్సాహంగా సాగిన మారథాన్.. పాల్గొన్న కలెక్టర్ అధికారులు
నిర్మల్ మే 18 (విజయక్రాంతి) : ఆరోగ్యవంతమైన సమాజం ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక యువజన, క్రీడా వారోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం నిర్వహించిన ఫిట్ అండ్ ఆక్టివ్ తెలంగాణ, మారథాన్ అండ్ ఫిజికల్ లిటరసీ కార్యక్రమాన్ని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. పట్టణంలోని శివాజీ చౌక్ (మంచిర్యాల చౌరస్తా) నుంచి ప్రారంభమైన మారథాన్ ఎన్టీఆర్ మినీ స్టేడియం వరకు ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది.
యువత, విద్యార్థులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం ఎన్టీఆర్ మినీ స్టేడియంలో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, యోగా, శారీరక వ్యాయామం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని పేర్కొన్నారు. నిరంతర శారీరక శ్రమ వల్ల అనేక దీర్ఘకాలిక వ్యాధులను దూరం చేసుకోవచ్చని, భవిష్యత్తులో అనారోగ్య సమస్యలు రాకుండా ఉండేందుకు ప్రతిరోజూ వ్యాయామం చేయాలని సూచించారు.
యోగా, ఎక్స్సజ్ల ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన యోగాసనాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి, డివైఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, డిఈఓ భోజన్న, సిపిఓ జీవరత్నం, మునిసిపల్ కమిషనర్ రవి బాబు, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.






