24 గంటల్లోనే చోరీ కేసును ఛేదించిన ధర్మపురి పోలీసులు
‘చోరీకి గురైన బంగారం, వెండి ఆభరణాలు,ద్విచక్ర వాహనం పూర్తి రికవరీ
‘అభినందించిన జిల్లా ఎస్పీ, డీఎస్పీ లు
ధర్మపురి,జూలై3(విజయక్రాంతి): ధర్మపురి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన చోరీ కేసును ధర్మపురి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎ. రాం నర్సింహారెడ్డి పర్యవేక్షణలో, ఎస్త్స్ర జి. మహేష్ ఆధ్వర్యంలో ధర్మపురి పోలీసులు కేవలం 24 గంటల్లోనే ఛేదించి, నిందితుడిని అరెస్టు చేసి చోరీకి గురైన ఆస్తిని పూర్తిగా రికవరీ చేశారు.
వివరాల్లోకి వెళితే ధర్మపురికి చెందిన లత తన నివాసంలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడి 2 తులాల బంగారు ఆభరణాలు, 14 తులాల వెండి ఆభరణాలు అపహరించినట్లు ఫిర్యాదు చేయగా, వెంటనే కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీలు, ఇతర సమాచారాన్ని సేకరించి కేసును కేవలం 24 గంటల్లోనే ఛేదించారు. నిందితుడిని అరెస్టు చేసి, అతని వద్ద నుండి చోరీకి గురైన 2 తులాల బంగారు ఆభరణాలు, 14 తులాల వెండి ఆభరణాలను పూర్తిగా రికవరీ చేసి స్వాధీనం చేసుకున్నారు.
అలాగే, నిందితుడు గతంలో చేసిన ద్విచక్ర వాహన చోరీ కేసును కూడా వెలికితీసి, ఆ వాహనాన్ని సైతం రికవరీ చేశారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఐపీఎస్, డీఎస్పీ పురుషోత్తం రెడ్డి కేసును వేగంగా ఛేదించి, చోరీ సొత్తును పూర్తిగా రికవరీ చేసిన ధర్మపురి సీఐ ఎ. రాంనర్సింహారెడ్డి,ఎస్ఐ జి. మహేష్ మరియు ధర్మపురి పోలీస్ స్టేషన్ సిబ్బందిని అభినందించారు.






