4 June, 2026 | 3:15 AM

అధిక ధరలను నిరసిస్తూ జూన్ 10న కలెక్టరేట్ ఎదుట ధర్నా

04-06-2026 02:22 AM

సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా

కొత్తగూడెం, జూన్ 3 (విజయక్రాంతి); దేశంలో నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ సామాన్యుల నడ్డి విరుస్తోందని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా అన్నారు. జిల్లా కేంద్రంలోని సిపిఐ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన నియోజకవర్గ స్థాయి కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల వల్ల అడ్డు అదుపులేకుండా పెంచుతున్న ధరలపై ప్రజలు గళం విప్పాలని, అప్పుడే పాలకుల్లో చలనం వస్తుందని ఆయన పిలుపునిచ్చారు. పెరిగిన నిత్యావసరాలు, గ్యాస్, పెట్రోల్, డీజిల్ అధిక ధరలను నిరసిస్తూ జూన్ 10న చేపట్టబోయే కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని ప్రజలు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.  కేంద్రం తన వైఖరి మార్చుకుని ధరలను నియంత్రించేవరకు కేంద్రంపై పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తూ, నాయకులు, కార్యకర్తలు నిరంతరం ప్రజల్లో మమేకమై స్థానిక సమస్యలను గుర్తించి రాజీలేని పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు.  మరోవైపు కొత్తగూడెం నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కృషితో అభివృద్ధివైపు అడుగులు వేస్తున్న నియోజకవర్గంగా కొత్తగూడెం మారుతోందని, అనేక దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న సమస్యలు ఒక్కొక్కటిగా పరిస్కారం కావడం హర్షణీయమని అన్నారు. కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు కంచర్ల జమలయ్య, కందుల భాస్కర్, వాసిరెడ్డి మురళి, జిల్లా సమితి సభ్యులు నేరెళ్ల రమేష్, గొనె మని తదితరులు పాల్గొన్నారు.