23 March, 2026 | 1:42 AM

తిరుగు ప్రయాణంలో ఇబ్బందులు

23-03-2026 12:00 AM

కల్వకుర్తి, మార్చి 22: వరుస సెలవులు, ఉగాది , రంజాన్ పండుగల సందర్భంగా స్వగ్రామాలకు వెళ్లిన ప్రజలు తిరుగు ప్రయాణంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆదివారం పట్టణాలకు తిరిగి వెళ్తున్న ప్రయాణికులతో బస్టాండ్లు కిక్కిరిసిపోయాయి. ముఖ్యంగా కల్వకుర్తి బస్టాండ్లో రద్దీ తీవ్రంగా పెరిగింది.

హైదరాబాద్ మార్గంలో ఆర్టీసీ బస్సులు నడుస్తున్నప్పటికీ, ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా బస్సులు లేకపోవడంతో ప్రజలు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్ని బస్సుల్లో సామర్థ్యాన్ని మించి ప్రయాణికులు ఎక్కించడంతో తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ప్రత్యేక బస్సుల పేరుతో అధిక చార్జీలు వసూలు చేస్తున్నప్పటికీ, సరిపడా సర్వీసులు అందుబాటులో లేకపోవడం పై ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు.

పిల్లలు, మహిళలతో పాటు వృద్ధులు కూడా నిల్చునే ప్రయాణాలు చేయాల్సి వచ్చింది. ఎండలు మండుతుండడంబస్టాండ్లో తాగునీటి సదుపాయం లేకపోవడంతో ప్రయాణికులు అధిక ధరలకు నీళ్లు కొనుగోలు చేసి దాహం తీర్చుకున్నారు. గ్యాస్ కొరత కారణంగా చిరు వ్యాపారులు తినుబండారాల ధరలు పెంచడంతో చాలామంది ఆకలితోనే ఉండాల్సి వచ్చింది. అధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించి అదనపు బస్సులు ఏర్పాటు చేయాల్సి ఉండగా, తగిన చర్యలు తీసుకోకపోవడం పై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేశారు.