calender_icon.png 9 June, 2025 | 3:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జర్నలిస్టుల సమస్యలపై ప్రత్యక్ష పోరాటం

08-06-2025 10:55:23 PM

సమస్యల పరిష్కారంలో జాప్యం తగదు..

దీర్ఘకాలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలి..

టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షు మామిడి సోమయ్య..

మంచిర్యాల (విజయక్రాంతి): జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేయడం తగదని, దీర్ఘకాలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(Telangana Working Journalists Federation) రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య డిమాండ్ చేశారు. ఆదివారం మంచిర్యాలలో జరిగిన టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా మహాసభల సన్నాహక సమావేశం, సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా.. జర్నలిస్టుల సమస్యలను ఇంత వరకు పరిష్కరించలేదని ధ్వజమెత్తారు.

ప్రభుత్వ జాప్యాన్ని నిరసిస్తూ త్వరలో రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టుల జన చైతన్య యాత్ర చేస్తామని ఆయన ప్రకటించారు. సమస్యలపై సమిష్టి పోరాటానికి జర్నలిస్టులు సన్నద్దం కావాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో మెజారిటీ జర్నలిస్టుల జీవన స్థితిగతులు దయనీయంగా మారుతున్నాయని, ముఖ్యంగా మండలస్థాయి విలేకరుల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం పదేళ్లు జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించకుండా ద్రోహం చేసిందని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తుందని ధ్వజమెత్తారు.  రాష్ట్రంలో రెండు జర్నలిస్టు సంఘాలు పాలకుల పక్షాన నిలిచి జర్నలిస్టుల సమస్యలను విస్మరించాయని ఆయన విమర్శించారు.

జర్నలిస్టులందరికీ ఉపయోగపడాల్సిన మీడియా అకాడమీని యూనియన్ సంస్థగా మార్చి తమ స్వప్రయోజనాల కోసం జేబు సంస్థగా వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జర్నలిస్టులకు ఏం ఒరిగిందని, ఏం మేలు చేశారని గత పాలకులు, జర్నలిస్టు సంఘాలు సంబరాలు జరుపుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. చెట్టుపేరు చెప్పి కాయలమ్ముకున్నట్టు జర్నలిస్టుల పేరు చెప్పి అధికార పదవులు పొంది పాలకులకు ఊడిగం చేస్తూ జర్నలిస్టులకు అన్యాయం చేస్తున్నారని దుయ్యబట్టారు. అలాంటి జర్నలిస్టు సంఘాల పట్ల యావత్ జర్నలిస్టులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. అర్హత ఉన్న అన్ని చిన్న పత్రికలను ఎంపానల్మెంట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

కమిటీల పేరుతో కాలయాపన చేయకుండా కొత్త అక్రెడిటేషన్ కార్డులు, హెల్త్ కార్డులు వెంటనే జారీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు ఇతర సంఘాల నుంచి పెద్దఎత్తున టీడబ్ల్యూజేఎఫ్ లో చేరుతున్నారని చెప్పారు. రాబోయే రెండు మూడు మాసాల్లో అన్ని జిల్లాల్లో ఫెడరేషన్ మహాసభలు పూర్తి చేసి పెద్ద ఎత్తున రాష్ట్ర మహాసభ నిర్వహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు ఫెడరేషన్ సభ్యత్వం తీసుకున్నారు. సీనియర్ జర్నలిస్టు మిట్టపెల్లి మధు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(ఐఎఫ్ డబ్ల్యూజే) కార్యదర్శి పులిపలుపుల ఆనందం, టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర  ఉపాధ్యక్షుడు బండి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సన్నాహక కమిటీ ఏర్పాటు

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) మంచిర్యాల జిల్లా సన్నాహక కమిటీ ఏర్పడింది. ఎనిమిది మందితో ఏర్పడిన ఈ కమిటీకి కన్వీనర్ గా మిట్టపెల్లి మధు(సూర్య), కో-కన్వీనర్లుగా సత్యగౌడ్(నేటిధాత్రి), కె.వెంకటస్వామి(ప్రజాపాలన), కె.రవి (దిశ), సభ్యులుగా ఎం. భీమయ్య(సూర్య), సుమన్(హెచ్ ఎం టీవీ), ఎం.రాజు(95టీవీ), కె.శ్రీనివాస్(సూర్య) తదితరులున్నారు. ఈ కమిటీ ఆధ్యర్యంలో జిల్లా వ్యాప్తంగా సభ్యత్వ నమోదు పూర్తి చేసి ఈ నెలాఖరులో జిల్లా మహాసభ జరపాలని సమావేశం తీర్మానించింది.