03-09-2024 12:00:00 AM
సహజంగా మన దేశంలో చాలామందికి విదేశాల్లో చదవాల ని, అక్కడే ఉద్యోగ ఉపాధి అవకాశాలు సాధించాలని, స్థిరపడిపోవాలని ఆకాంక్ష చాలా కాలంగా కొనసాగుతున్నది. గతంలో ధని కులు, భూస్వాములు సమాజంలో అగ్రభాగాన ఉన్నవారు మాత్ర మే విదేశాలకు వెళ్లి చదివేవారు. అయితే, 1990 దశకం నుంచి సరళీకృత ఆర్థిక విధానాలు అమలు చేయడం, ప్రైవేటు పాఠశాల లు, బ్యాంకులు కాలక్రమేణా దేశంలో అన్ని ప్రాంతాల్లో విస్తరించి ప్రజలకు అందుబాటులోకి రావడంతో సమాజంలో ముఖ్యంగా సామాన్య కుటుంబ సభ్యులు అందివచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ విదేశాలకు వెళ్లి చదవడానికి క్యూ కడుతు న్నారు.
2023లో సుమారు 13 లక్షలు మంది, ఈ 2024లో ఇప్పటికే 13.25 లక్షల మంది విద్యార్థులు విదేశీ చదువుల కోసం వెళ్ల టం జరిగింది. ముఖ్యంగా కెనడా, ఆస్ట్రేలియా, అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ వంటి దేశాలకు అత్యధికంగా వెళ్లారు. దీంతో ఇటీవలి కాలంలో ఆయా దేశాల్లో స్థానికులు ఆందోళన చెందుతు న్నారు. నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా ఆయా దేశాలు ఇతర దేశాల నుంచి విద్యార్థుల రాకను కట్టడి చేయడానికి కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా కెనడా, ఆస్ట్రేలియా, అమెరికా వంటి దేశాలు వీసా నిబంధనలు కఠినతరం చేస్తున్నా యి.
మినిమం బ్యాంకు బ్యాలెన్స్ రూ.16 లక్షలు పైబడి ఉండాలని నిర్దేశిస్తున్నాయి. పీజీ కోర్సుల ప్రవేశానికి మోకాళ్ళు అడ్డుపెడుతున్నాయి. ఫలితంగా మనవాళ్లు అక్కడ ఉండలేక, ఇక్కడికి రాలేక త్రిశంకు స్వర్గంలో వేలాడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మన ప్రభుత్వం కూడా ఆయా ప్రభుత్వాలతో చర్చలు జరిపి సమస్యలు పరిష్కారం చేయాలి. అదే సందర్భంలో దేశంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలి. అన్నిటికన్నా ముందు దూరపు కొండలు నునుపు అనే భావననుంచి యువత బయటపడాలి.. లేకపోతే, భవిష్యత్తు ‘రెంటికి చెడిన రేవడి’ వలే తయారవుతుంది.
‘పరుగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్లు తాగడం మేలు’ అని పెద్దలు చెప్పిన మాటలు నిజమే కదా. నేడు ప్రపంచవ్యాప్తంగా అనేక ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితుల్లో స్థానికంగానే స్థిరపడడానికి ప్రయత్నాలు చేయడం ఉత్తమం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా ప్రాంతాల ప్రజల అవసరాలకు అనుగుణంగా విద్య, వైద్యం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారానే దేశం సుస్థిర అభివృద్ధి సాధిస్తుందని గ్రహించాలి. ‘ఆత్మ నిర్భర్ భారత్’ ద్వారా ‘వికసిత భారత్’ ఆవిష్కరణ చేయాలని కోరుకుందాం.
ఐ.ప్రసాదరావు