calender_icon.png 21 June, 2025 | 9:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘భాస్కర రామాయణం’ రాసిన మరో కవి మల్లికార్జున భట్టు

02-09-2024 12:00:00 AM

తొలి చంపూ రామాయణమైన ‘భాస్కర రామాయణం’ రచించిన నలుగురు కవులలో ఎక్కువ భాగం రచించిన కవి మల్లికార్జున భట్టు.. హుళక్కి భాస్కరుని కుమారుడు. అంటే, ఉన్న నలుగురిలో ఇద్దరు తండ్రీకుమారులే కావడం ఒక విశేషం. ‘శ్రీమదష్ట భాషాకవి మిత్ర కులపవిత్ర భాస్కర సత్కవిపుత్ర మల్లికార్జున భట్టు ప్రణీతంబైన శ్రీమద్రామాయణ మహాకావ్యం బునందు..’ అన్న ఆశ్వాసాంత గద్యాన్ని అనుసరించి, ఈ మల్లికార్జునుడు భాస్కరుని కుమారుడనేగాక భాస్కర కవి కూడా మహా ప్రతిభామూర్తి అని, ఆయన అష్టభాషా కవి మిత్రుడని తెలుస్తున్నది.

‘భాస్కర రామాయణం’లో అవతారిక, ఇష్టదేవతా స్తుతి, సుకవి స్తుతి, కుకవి నింద వంటివేవీ కనిపించవు. మల్లికార్జునుడు ప్రారంభించిన బాలకాండము తొలుత-

‘శ్రీరామా కుచయుగళీ

హరిద్రోల్లసిత హరిచరణ సరో

జాచార్య బుద్ధ విబుధ నుత

సారసహిత తేజ ధీర సాహిణి మారా!’

అన్న పద్యంతో ఆరంభమై, నేరుగా అయోధ్యాపుర వర్ణనతోనే కార్యం మొదలైంది. మరే విధమైన అవతారిక లేదు. కావ్యం నేరుగా మొదలు పెట్టడానికి ఇదొక ఒరవడిని అవలంబించినట్లుగా మనం భావించాలి. “నాచన సోముని ‘ఉత్తర హరివంశానికి’ కూడా అవతారిక లేకపోవడం గమనించదగింది” అని డా॥ గండ్ర లక్ష్మణరావు అభిప్రాయాన్ని ఈ సందర్భంగా పరిగణనలోకి తీసుకొన్నప్పుడు, ఈ పద్ధతి ఒక కొత్త మార్గానికి దారి తీసినట్లుగా కనిపిస్తుంది.

కుమారుని ప్రతిభకు పట్టం

బాల, కిష్కింధ, సుందర కాండలలో మల్లికార్జున భట్టు కవిత్వ ప్రతిభ అడుగడుగునా గమనించవచ్చు. రామాయణాన్ని మల్లికార్జునుడు ‘మహాకావ్యం’ అన్నాడు. అయితే, ఈ రామాయణం వాల్మీకి రామాయణమంత విస్తృతంగా లేదన్నది పండితుల అభిప్రాయం. కొన్ని సందర్భాల్లో సామాన్య జనంలోనే రామకథా సంబంధమైన అనేక కల్పలనలకు జనశ్రుతిలోని రామభక్తిని తెలిపే అవాల్మీకాలకు కూడా మల్లికార్జునుడు తన రచనలో చోటిచ్చి, ఆ కథలకు మాన్యత కల్పించి కావ్య గౌరవాన్ని ప్రసాదించాడు.

భాస్కర రామాయణ కవులు రామాయణ రచన ప్రారంభించే నాటికే తెలుగులో ద్విపద రామాయణం వచ్చింది. అందుకే, ఈ కవులు గద్య పద్యాత్మకమైన చంపూ కార్యపద్ధతిలో తొలి రామాయణం రాయాలన్న సంకల్పానికి శ్రీకారం చుట్టి ఉంటారు. ఈ మేరకే హుళక్కి భాస్కరుడు తన పుత్రునితో రామాయణ రచనను ప్రారంభింపజేశాడు. ‘భాస్కర రామాయణ’ రచనలో ఎక్కువ భాగం రచించిన మల్లికార్జున భట్టుదే ఇందులో మొదటిస్థానమవుతుంది. గద్య పద్యాలు లెక్కపెట్టి చూసినా ఇతనే మొదటి వరుసలో ఉంటాడు.

తండ్రికి తగ్గ తనయుడు

మల్లికార్జున భట్టు కవిత్వంలో తన తండ్రియైన భాస్కరునికి సమ ఉజ్జీగానే నిలుస్తాడు. అనేక వర్ణనలు, అలంకారాలు ఈయన రచనా భాగంలో దర్శనమిస్తాయి. సుందరకాండలో వానరులకు సీతమ్మ జాడ తెలిసిన వేళ వారిలోని అమితోత్సాహాన్ని ఘనంగా వర్ణించి చెప్పిన తీరు మనలను ఎంతో చక్కగా అలరిస్తుంది.

“కనుగొని తోక లెత్తుకొని గంతులు వైచుచు పీక నార్చుచున్

గునియుచు బారుచున్ నెగసికొమ్మల వ్రేలుచు నేలగూలుచున్

ఘనతరులెక్కుచున్ దిగుచు గ్రమ్మఱ బ్రాకుచు చెట్టు చెట్టుపై

కనువుగ దాటుచున్ జెలగి యాడుచు 

బాడుచు నోల వెట్టుచున్‌”

అంటూ అత్యంత సహజంగా వర్ణించాడు కవి. సహజసిద్ధమైన వానర చేష్టలనే సందర్భానికి జోడించడాన్ని సాహితీ వేత్తలు శ్లాఘించారు. కావ్యాల్లో వర్ణనలు సహజం. వర్ణనా నిపుణుడైన వాడే నిజమైన కవి అని లక్షణ శాస్త్రవేత్తలు శాస్త్రీయతను విప్పి చెప్పారు. ఈ వర్ణనల విషయంలో మాత్రం మల్లికార్జున భట్టు చూపించిన నైపుణ్యం అద్భుతం. వానరుల తీరును ఎంత సహజంగా వర్ణించాడో వారి అత్యుత్సాహాన్ని అదే స్థాయి వర్ణనలోనే ధ్వనింపజేశాడు. ఈ రకంగా సుందరకాండలోనే తార శోకవర్ణనను ఎంతో కరుణ రసాత్మకంగా మల్లికార్జునుడు వర్ణించాడు. దీనికి పాఠకుల హృదయాలు రసార్ద్రం అవుతాయి. ఇదీ మల్లికార్జునుని ప్రతిభ.

మూడు కాండల్లో 1,665 పద్యాలు

మల్లికార్జునుడు ఈ నలుగురు కవులలో చిన్నవాడైనా కవిత్వ రచనలో మాత్రం వారి స్థాయిని అందుకున్నాడు. ఆయన రచించిన మూడు కాండల్లోని 1,665 గద్య పద్యాలు మిగిలిన కవుల స్థాయికి తగినవిగా వున్నట్టు సాహిత్యకారులు గుర్తించారు. తన తండ్రియైన భాస్కరుని కవిత్వానికి దీటుగా ఇతని కవిత్వమూ ఉందన్న విషయం ఈ మూడు కాండల్లోని గద్య పద్యాలను గమనించిన పాఠకులకు అర్థమవుతుంది. అయితే, హుళక్కి భాస్కరుడు కావ్యాన్ని తాను ప్రారంభించకుండా తన పుత్రుడైన మల్లికార్జునుడితో ప్రారంభింపజేశాడు.

తాను మాత్రం అరణ్యకాండను రచించాడు. ఈ విషయాలకు సంబంధించిన అనేక కారణాలను సాహిత్య చరిత్రకారులు ఊహించారు. తన పుత్రుని ప్రతిభకు అవకాశం కలిగించి, తమ రామాయణంలో ఆయనకే ఎక్కువ అవకాశం ఇస్తూ, మూడు కాండలు రచింపజేయడం మాత్రమేగాక మల్లికార్జునునిలో కూడా తనంతటి ప్రతిభ ఉందని గుర్తించిన వాడు భాస్కరుడు. కాబట్టే, అరణ్యకాండ రచనను కొన్ని నమ్మకాలవల్ల తాను చేపట్టాడేమోనని కూడా కొందరు సాహిత్యవేత్తలు అభిప్రాయపడటం అంత సమంజసం కాదేమో!

సహజసిద్ధంగా హనుమ ఆలోచనలు

భాస్కరుని కవిత్వానికి దీటుగా మల్లికార్జునుని ప్రతిభ ఉందని చెప్పడానికి సుందరకాండలో ఎన్నెన్నో ప్రమాణాలు ఉన్నాయి. కొన్నిసార్లు ‘భాస్కరుడే సుందరకాండ రచించి మల్లికార్జునుని పేరు పెట్టాడా?’ అన్న అనుమానాలనుకూడా   చరిత్రకారులు వెలిబుచ్చారు. అంతగా పద్యాల్లో పోలికలు ఉన్నాయి. సుందరకాండలో సీతాన్వేషణకై బయల్దేరిని హనుమంతునికి తొలుత సీత జాడ ఎక్కడా కనిపించలేదు. ఆ సందర్భంలో అతని అంతర్మథనాన్ని అత్యంత వాస్తవికంగా వర్ణించాడు మల్లికార్జునుడు. ‘అసలు సీతమ్మ వారు ఏమైంది? రావణుడు సీతను అపహరించడం నిశ్చయమే.

మరి, ఆమె ఎందుకు కనిపించడం లేదు? ఆమె ఏమైనా ఆత్మహత్య చేసుకున్నదా? లేక, ఈ రాక్షసులు చంపి తిన్నారా? కాకుంటే అపహరణ సమయంలో సముద్రంలో పడిపోయిందా? ఒకవేళ సీతమ్మ కనిపించక పోతే ఆమె ప్రాణాలతో లేదని చెబితే రామచంద్రుడు తట్టుకోగలడా? ఆయన ప్రాణత్యాగం చేస్తాడేమో? ఆయన ప్రాణత్యాగం చేస్తే లక్ష్మణస్వామి కూడా ప్రాణత్యాగం చేస్తాడు కదా?అంతేకాదు, ఈ విషయాలు తెలిశాక భరత శత్రుఘ్నులు కూడా మిగలరు. ఈ వార్త వినడం వల్ల ఇక్షాకు వంశమే మిగలదు. ఆప్తమిత్రుడైన సుగ్రీవుడు కూడా ప్రాణం విడుస్తాడు.

వానర వంశంలోని ప్రముఖులందరూ నశించిపోయే ప్రమాదమూ రావచ్చు’ అని పరిపరి విధాలైన హనుమంతుని ఆలోచనా స్రవంతిని మల్లికార్జునుడు వర్ణించిన విధానం గొప్ప మానసిక శాస్త్రవేత్తలను తలపిస్తుంది. చివరకు ఆత్మ స్థయిర్యాన్ని పొందిన హనుమ స్థిరచిత్తుడై, ఒక దృఢమైన నిశ్చయానికి వస్తాడు. అప్పుడు తాను ఏమేమి చెయ్యాలనుకుంటాడో సుందరకాండలో వరుస పద్యాల్లో మల్లికార్జునుడు చెప్పుకొచ్చాడు. ఈ రచనా విధానమంతా పాఠకులను కావ్యంలో లీనమై పోయేలా చేస్తుంది.

తాను కనిపించగానే ‘సీతమ్మను చూచావా?’ అని రామచంద్ర ప్రభువు మొదటి ప్రశ్న వేస్తాడు. అపుడు  ‘చూడలేదని’ చెప్పలేను కదా! పైగా, మొత్తం వానర జాతి తన రాక కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది. కనుక, తాను అన్వేషణనను మరింత లోతుగా ప్రయత్నించాల్సిందే. ఒకవేళ అవసరరమైతే ఈ లంకను, లంకాధిపతిని తన పరాక్రమంతో సంహరించి పరమశివునికి బలి ఇస్తాను. తర్వాత తన శరీరాన్ని కూడా పక్షులకు ఆహారంగా ఇచ్చుకుంటాను. సీతమ్మ జాడ తెలుసుకోలేని తాను జీవించడం వృథా’ అన్న కోణంలోనూ హనుమ ఆలోచనలు సాగుతాయి.

“జానకి గానక యుండిన

వాన ప్రస్థుండ నగుదు, వనధింబడుదున్

మేను ఖగావళి కిత్తును మ

వా నలముఖ శిఖల సొత్తు హతవిధి జిత్తున్‌”

అంటాడు కవి హనుమలోని క్రోధాన్ని వ్యక్తపరుస్తూ.

“అటుగా కుర్వి సహస్రముం బెరికి కొంచారాముడీ క్షింప నం

తట శోధించెద సీత జూపుమని వేధం బట్టి బాధించెదన్

బటు రోషమ్మున భారమీటెద వడిన్ బ్రహ్మాండముల్ వీక నొ

నొక్కట లంకాది నిశాటకోటి నుదధిన్ గాలించి కారిం చెదున్‌”

అని భీషణ భావాలతో మళ్లీ సీతాన్వేషణకు నడుం కట్టాడు హనుమ. కార్యసాధకుడైన వాడు కడు సమర్థుడైనప్పుడు ఆ కార్యాన్ని ఏ విధంగానైనా సాధిస్తాడు. సాధ్యం కాదేమోనని ఎప్పటికీ నిరాశకు లోనుగాడు. ఒక్కోసారి ఫలితాలు బాధ పెడతాయి. భయ పెడతాయి. అనేక ఆలోచనలకు అవకాశమిస్తాయి. కానీ, ధీరుడు, స్థిరచిత్తుడు, వీరుడు అయిన వాడు పునరాలోచించుకొని కార్యశూరుడై పనిలో సత్ఫలితాలు సాధిస్తాడు. ఈ సందర్భంలో అతని అంతరంగం ఎట్లా ఉంటుందో మల్లికార్జునుడు హనుమలోని అంతఃస్సంఘర్షణను హృద్యంగా దృశ్యమానం చేశాడు.

ఈ కవి ప్రతిభకు ఇది మరొక విలక్షణమైన ఉదాహరణ. ఈ అంతఃస్సంఘర్షణ చిత్రణలో కవి హనుమంతుని భావాలలో ఒక క్రమం కనిపించే రీతిలోనే రాశాడు. ఆశాభంగం కన్నా ఆత్మహత్యే మేలనుకుంటాడు కపివీరుడు. ఎట్లానైనా రావణుని సంహరించాలనీ అనుకున్నాడు గనుక, వాణ్ణి సీతను ఎక్కడ దాచాడో అడిగి తెలుసుకోవచ్చుననుకున్నాడు. అయినా, దాచిన వానినే అడగడమేమిటి? నేనే స్వయంగా తెలుసుకుంటానని నిర్ణయించుకున్నాడు. ఈ విధంగా కవి సుందరకాండలో ఏకాశ్వాసంలోనే అనేక భావ పరంపరలను గుమ్మరించడం ద్వారా రచనను ఆసాంతం ప్రకాశవంతం చేశాడు. 

తెలుగు సాహిత్యంలోనే ఒక మైలురాయిగా నిలిచిన ఈ ‘భాస్కర రామాయణాన్ని’ గురించి ప్రత్యేకంగా పరిశోధన చేసి పట్టా సాధించిన ప్రముఖ విద్వన్మూర్తి ఆచార్య రవ్వా శ్రీహరి వంటివారే గాక ఎందరెందరో సాహితీమూర్తులు అనేక కోణాలలో దీని ఘనతను వెల్లడించి, మల్లికార్జునుని ప్రతిభకు దర్పణం పట్టారు.

జాతీయాలు, సామెతలు

మల్లికార్జునుడు తన రచనలో అనేక జాతీయాలను, సామెతలనూ ఉపయోగించి, ఆయా సందర్భాలకు వన్నె తెచ్చాడు. ‘అందని మ్రానిపండులకు అర్రులు సాతురే’, ‘వంటిల్లు సొచ్చిన కుందేటికి నీకు బోలిక గలదే?’ వంటి పలు సామెతలు, ‘కాయకసరు’, ‘ప్రాణాలు చిక్కబట్టుకోవడం’ వంటి అనేక జాతీయాలూ మల్లికార్జునుని రచనలో కనిపిస్తాయి. తండ్రితో సరితూగగల కవితా ప్రతిభ కలిగిన మల్లికార్జున భట్టు తన లోకజ్ఞతను సమర్థంగా తెలియ చేశాడు.

కిష్కింధకాండలో ఒక సందర్భంలో రాజులైన వారు ఎన్ని విధాలుగా వేటలు నిర్వహిస్తారో ఒక పెద్ద సీసపద్యంలో చెప్పాడు. ఇటువంటి ఎన్నో సందర్భాలను మల్లికార్జునుడు తన నిజ జీవితంలో చూసి ఉంటాడు కనుక, వాలి నోట ఆ దృశ్య సంబంధ మాటలు చెప్పించాడు. దానివల్ల ఏ కాలపు పాలకునికైనా వేటల వివరాలు అవగాహనకు వస్తాయి. 

ఇంకా పలు ఘట్టాల్లో మల్లికార్జున భట్టు తన అపార ప్రతిభా పాటవాలను ప్రదర్శిస్తూ ఎంతో ప్రశస్తిని సాధించాడు. రామాయణ కర్తగా చిరకీర్తిని పొందాడు. ఋష్యశృంగుని వారకాంతలు వలపించిన ఘట్టంలో ఆయన చూపిన ముగ్ధ శృంగార రసవర్ణన పాఠకుల హృదయాలను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

గన్నమరాజు గిరిజా మనోహరబాబు

9949013448