calender_icon.png 21 June, 2025 | 6:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరుణుడి కన్నెర్ర

03-09-2024 12:00:00 AM

తెలంగాణపై మరోసారి ప్రకృతి కన్నెర్ర చేసింది. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసి శ్రీశైలం, నాగార్జున సాగర్ సహా అన్ని ప్రధాన రిజర్వాయర్లు నిండాయని, పంటలకు ఢోకా ఉండదని రైతాంగం సంతోషిస్తున్న తరుణంలో బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుపాను గా మారి రాష్ట్రంపై విరుచుకుపడింది. శనివారం రాత్రినుంచి ఆదివారం ఉదయం వరకు కుండపోత వానలు రాష్ట్రాన్ని కుదిపేశాయి. గతంలో ఎన్నడూ చూడని విధంగా  సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో ఆకాశానికి చిల్లిపడిన రీతిలో వానలు కురిశాయి. 24 గంటల వ్యవధిలో అనేక ప్రాంతాల్లో దాదాపు 30 సెంటీమీటర్ల దాకా వర్షం పడిందంటే ఏ స్థాయి లో వాన ఉధృతి ఉందో అర్థమవుతుంది.

మున్నేరు వాగుకు వరద రావడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా అతలాకుతలమైంది. వందలాది మంది వరదల్లో చిక్కుకుని సహాయం కోసం ఆర్తనాదాలు చేశారు. మంత్రులు, అధికార గణం సకాలంలో స్పందించడంతో దాదాపుగా అందరినీ సురక్షితంగా కాపాడగలిగారు. కొద్దిపాటి ప్రాణనష్టం మాత్రమే జరిగింది. సూర్యాపేట సమీపంలో హైదరాబాద్‌విజయవాడ జాతీయ రహదారిపైకి వరదనీరు చేరడంతో హైవేపై రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఖమ్మం, కోదాడ పట్టణాల్లో అనేక కాలనీలు నీట మునగడంతో వందలాది మందిని పునరావాస శిబిరాలకు తరలించారు. కట్టుబట్టలతో మిగిలామని బాధితులు వాపోతున్నారు.

వాగులు, వంకలు, చెరువులు అన్నీ పొంగి ప్రవహించడంతో వేలాది ఎకరాల పంటపొలాలు చెరువులను తలపిస్తున్నాయి. ఆరుగాలం శ్రమ నీటి పాలయిందని రైతులు వాపోతున్నారు. బాధితులను ఆదుకోవడంలో రాష్ట్రప్రభుత్వం సకాలంలో స్పందించడం ఊరటనిస్తున్న అంశం. వరదల కారణంగా  ప్రాణాలు, పశువులు, పంట కోల్పోయిన వారికి ముఖ్యమంత్రి ఉదారంగా పరిహారం ప్రకటించడమే కాకుండా సూర్యాపేట, ఖమ్మం పట్టణాల్లో స్వయంగా పర్యటించి బాధితులు ప్రతిఒక్కరినీ ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.

ఏజన్సీ గ్రామాల్లో మంత్రి సీతక్క  విస్తృతంగా పర్యటించి  గిరిజనుల్లో భరోసా నింపారు. ఇక భాగ్యనగరం ఎప్పటిలాగే భారీ వర్షాలకు అతలాకుతలమయింది. అనేక లోతట్టు ప్రాంతాలే కాకుండా  కోట్ల విలువ చేసే విల్లాస్ కూడా వరద నీటిలో చిక్కుకున్నాయి. కాలువల కబ్జాయే ఈ పరిస్థితికి కారణమ ని ఆరోపిస్తున్నారు.  చెరువులు, నాలాలపై ఆక్రమణల తొలగింపు లతో అక్రమణదారుల గుండెల్లో దడ పుట్టించిన హైడ్రా తాత్కాలికంగా కూల్చివేతలకు విరామమిచ్చి విపత్తుల నిర్వహణలో నిమగ్నమైంది.  

తుపాను ఒక్క తెలంగాణనే కాదు, పక్కనే ఉన్న ఏపీలోనూ విలయాన్నే సృష్టించింది.బుడమేరు వాగు పొంగడంతో విజయవాడ నగరంలో సగం  నడుంలోతు నీళ్లలో మునిగిపోయింది. సింగ్‌నగర్, చుట్టుపక్కల ప్రాంతాల్లోని దాదాపు రెండున్నర లక్షల మంది కాలు బైటపెట్టే స్థితి లేక బిక్కుబి క్కుమంటూ ఇళ్లపైకెక్కి సాయం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. సీఎం చంద్రబాబు స్వయంగా ఈ ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు ఆహారం, పాలు, తాగు నీరు వంటి కనీస సదుపాయాలకు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది.

వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు పడవలు, ట్రాక్టర్లలో తరలించారు. పదుల సంఖ్యలో ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు, ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా అక్కడే కేంద్రీకృతమై సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. వరద తాకిడికి  రెండు చోట్ల రైల్వే ట్రాక్ కొట్టుకు పోవడంతో  విజయవాడ మార్గంలో వందలాది రైళ్లను రద్దు చేయాల్సి వచ్చింది. అన్నిటికీ మించి ప్రకాశం బ్యారేజి గత వందేళ్లలో ఎన్నడూ లేనంత వరదను చూసింది. 11.5 లక్షల క్యూసెక్కులకు పైగా నీటిని సముద్రంలోకి వదిలారు. ఈ ప్రవాహంతో దిగువన ఉన్న వందలాది లంక గ్రామాలకు ఇప్పుడు వరద ముప్పు పొంచి ఉందంటున్నారు. అదృష్టవశాత్తు తీరం దాటిన తుపాను బలహీన పడ్డంతో ఉభయ రాష్ట్రాలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నాయి.