30-12-2025 07:02:58 PM
కాటారం,(విజయక్రాంతి): కాటారం మండలంలో ఎరువుల సరఫరా పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకున్నామని జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయనతో పాటు మహాదేవపూర్ ఏడీఏ శ్రీపాల్ కలిసి కాటారం మండలంలోని వివిధ ఎరువుల డీలర్ అవుట్లెట్లను తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా డీలర్ కేంద్రాల్లో అందుబాటులో ఉన్న యూరియా నిల్వలను ఫైవ్స్ యాప్ ద్వారా ధృవీకరించారు.
స్టాక్ రిజిస్టర్లు, విక్రయ వివరాలు, బిల్లింగ్ ప్రక్రియలను పరిశీలించి, ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలను కచ్చితంగా పాటించాలని డీలర్లకు సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన మేరకు యూరియా సరఫరా నిరంతరం కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ఎరువుల అక్రమ నిల్వలు, అధిక ధరలకు విక్రయాలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.