15 April, 2026 | 11:01 AM

చిట్టి బుడతలు.. గొప్ప శాస్త్రవేత్తలు..!

30-12-2025 12:00 AM

హాజరైన జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, డీఈవో రమేష్ కుమార్

నాగర్‌కర్నూల్, డిసెంబర్ 29 (విజయక్రాంతి): జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి ఇన్స్పైర్ బాల వైజ్ఞానిక ప్రదర్శన సోమవారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. డీఈవో రమేష్ కుమార్ కలెక్టర్తో కలిసి విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్ ప్రాజెక్టులను సందర్శించారు. బల్మూర్ జడ్పి.హెచ్.ఎస్ పాఠశాలకు చెందిన కిరణ్ సాగర్ అనే 9వ తరగతి విద్యార్థి రైతులకు అనుకూలంగా సోలార్, విత్ బ్యాటరీ సహాయంతో దుక్కులు దున్నే నాగలి తయారు చేశాడు.

అదే పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థి గగన్ చంద్ర త్రీ ఇన్ వన్ సైకిల్ తయారు చేసి జాతీయస్థాయిలో ఉత్తమ ప్రతిభ పురస్కారాన్ని అందుకున్న ఉత్సాహంతో తయారు చేసిన, సోలార్ బ్యాటరీ విత్ ఇంజన్ త్రీ ఇన్ వన్ హైటెక్ కారు అందరినీ ఆకట్టుకుంది. బిజినపల్లి మండలం కస్తూర్బా గాంధీ పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్న నిషా అనే విద్యార్థిని శరీరానికి హాని కలిగించే జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల శరీరంలో కలిగే అనర్ధాలు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే కలిగే లాభాలపై మెడలో రెండు వ్యత్యాసాలను చూపుతూ ప్రదర్శించిన తీరు అందరిని అబ్బురపరిచింది.

అతి చిన్న వయసు గల విద్యార్థులు గొప్ప మేధస్సుతో సైన్స్ పట్ల అవగాహన కల్పించేలా చేసిన ప్రదర్శనలు ఇతర విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా 93 అంశాలవారీగా 360 ప్రదర్శనలను విద్యార్థులు ఏర్పాటు చేశారు. కేజీబీవీ తాడూర్, కేజీబీవీ పెద్దకొత్తపల్లి, కేకే రెడ్డి పాఠశాల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.