20-06-2025 06:58:06 PM
బాధితులకు తక్షణమే, సలహాలు, సహాయం అందించాలి..
భరోసా కేంద్రాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే..
రాజన్న సిరిసిల్ల (విజయక్రాంతి): సిరిసిల్ల పట్టణ పరిధిలోని శ్రీనగర్ కాలనిలో ఉన్న భరోసా కేంద్రాన్ని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే(District SP Mahesh B. Gite) శుక్రవారం సందర్శించి లైంగిక, భౌతిక దాడులకు గురైన బాధితులకు భరోసా సెంటర్లో కల్పించే న్యాయ సలహాలు, సైకలాజికల్ కౌన్సెలింగ్, వైద్య పరంగా తీసుకుంటున్న చర్యలు, మహిళల వేధింపులపై నమోదు అవుతున్న కేసుల వివరాలు తదితర విషయాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... పోక్సో చట్టం పరిధిలోకి వచ్చే కేసుల్లోని బాధిత మహిళలను అక్కున చేర్చుకుని వైద్యుడు, సైకాలజిస్టు, న్యాయాధికారి, పోలీసులు న్యాయ సహాయం చేయడం, ప్రభుత్వం నుంచి పరిహారం ఇప్పించడం వంటి సేవలతో బాధితులకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో 'భరోసా' కేంద్రం పని చేస్తుందని అన్నారు. బాధితులు రాగానే ఎవరి పరిధిలో వారు పనిచేస్తూ సత్వర న్యాయానికి కృషి చేస్తారని పెర్కొన్నారు. లైంగిక దాడులకు గురైనా బాధితులకు భరోసా కల్పించడంతో పాటు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు.