9 August, 2026 | 11:34 AM

డివిజన్ సమస్యలు పరిష్కరించాలి

26-05-2024 01:49 AM

ఎల్బీనగర్, మే 25 : కొత్తపేట డివిజన్‌లో నెలకొన్న సమస్యలను పరిష్కరిం చడంతో పాటు అభివృద్ధి పనులను ప్రారంభించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ రొనాల్డ్‌రాస్‌కు శనివారం కార్పొ రేటర్ నాయిని పవన్‌కుమార్ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ పవన్‌కుమార్ మాట్లాడుతూ.. కొత్తపేట డివిజన్‌లో నెలకొన్న సమస్యలను జీహెచ్‌ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్‌కు వివరించానన్నారు. ఎస్‌ఆర్‌ఎల్ కాలనీలోని ప్రధాన రోడ్డులో వర్షపు నీరు వెళ్లడానికి నిర్మించిన సీసీ డ్రైన్ల నిర్మాణాలను ఏడాది క్రితం ప్రారంభించినప్పటికీ ఇప్పటివరకు పూర్తి చేయలేదన్నారు.

పనులు నిలిచిపోవడంతో వానకాలంలో వరద ఇళ్లలోకి చేరుతుందని, తద్వారా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పటికైనా సీసీ డ్రైన్ల నిర్మాణాలను పూర్తి చేయాలని కోరారు. సత్యానగర్, రాఘవేంద్ర కాలనీలతో పాటు భరత్‌నగర్, రాజీవ్‌గాంధీ నగర్‌లో డ్రైనేజీ పనులు పూర్తి చేసినా, రోడ్డు పనులను మాత్రం చేపట్టలేదన్నారు. డ్రైనేజీ పనులు పూర్తి చేసి, రోడ్డు పనులు పూర్తి కాకపోవడంతో వర్షం పడినప్పుడు వరదతో రోడ్లన్నీ బురదగా మారుతున్నట్లు తెలిపారు. వెంటనే రోడ్డు మరమ్మతులు పూర్తి చేయాలని కోరారు. కొత్తపేట డివిజన్‌లో తాగునీటి సమస్యను పరిష్క రించాలని విజ్ఞప్తి చేశారు.