calender_icon.png 7 October, 2025 | 12:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

45వ వార్డులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు చెయ్యొద్దు

07-10-2025 12:00:00 AM

సూర్యాపేట, అక్టోబర్ 6 (విజయక్రాంతి) : జిల్లా కేంద్రంలో ప్రణాళిక లేకుండా చేపడుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కావున 45వ వార్డులో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు చేయవద్దని బిఆర్‌ఎస్ జిల్లా నాయకులు గండూరి కృపాకర్ అన్నారు. సోమవారం పట్టణంలోని 45వ వార్డులో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులను ఆయన అడ్డుకొని మాట్లాడారు.

ఇటీవల వార్డులో నిర్వహించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులతో ప్రజలు ప్రమాదాల బారిన పడ్డారని ఈ విషయమై అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం పెద్ద పెద్ద గుంటలు తీసి చిన్న పైపులు వేసి నామ మాత్రంగా పూడ్చి వెళ్తున్నారని దీంతో ప్రజలు వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారన్నారు.

అసలు జిల్లా కేంద్రంలో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ఏ వార్డులో విజయవంతంగా పూర్తయ్యాయో కాంట్రాక్టర్, అధికారులు సమాధానం చెప్పాలన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులు విజయవంతంగా పూర్తి చేసిన ఓ వార్డును స్పూర్తిగా చూపించి మిగతా వార్డుల్లో పనులు చేపట్టాలని అన్నారు. 

అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల కోసం తీసిన గుంటలను నెలల తరబడి పుడ్చకపోవడంతో తమ వార్డుకు చెందిన ఒకరికి తల పగిలిందని ఇలాంటి ప్రమాదాలు జరిగిన సంఘటనలు కోకోలాలుగా ఉన్నాయని అన్నారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ కు కూడా ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేదని అన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మా వార్డులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులు నిలిపివేసి ప్రజల ప్రాణాలను రక్షించాలని వేడుకున్నారు.ఈ కార్యక్రమంలో కుక్కడపు బిక్షం, వెంకటేష్, సందీప్, వార్డు పెద్దలు, ప్రముఖులు పాల్గొన్నారు.