calender_icon.png 31 May, 2025 | 4:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాన్చుడా..? తేల్చుడా?

30-05-2025 03:32:56 AM

  1. నేడు ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ 
  2. మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కూర్పుపై పార్టీపెద్దలతో చర్చ  
  3. మంత్రివర్గంలో చోటు కోసం కులాలవారీగా ఒత్తిడి 
  4. మంత్రివర్గంలో చోటివ్వాలని కేసీ వేణుగోపాల్‌తో సమావేశమైన మాదిగ ఎమ్మెల్యేలు 
  5. తమకు ప్రాతినిధ్యం కల్పించాలని బీసీ నాయకుల విజ్ఞప్తులు 

హైదరాబాద్, మే 29 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ అధిష్ఠానం ఇప్పుడైనా తేల్చుతుందా..? లేక  నాన్చుతుందా..? అని పార్టీవర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ విషయమై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ శుక్రవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేసీవేణుగోపాల్‌తో సమావేశం కానున్నారు. ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీతోనూ సమావేశమ య్యే అవకాశం ఉంది.

ఏడాదిన్నర కాలంగా వాయి దా పడుతూ వస్తున్న మంత్రివర్గ విస్తరణపై ఈపర్యటనలో అధిష్ఠానం తుదినిర్ణయం తీసుకునే అవకా శం ఉందని చర్చ జరుగుతోంది. రాష్ట్ర క్యాబినెట్‌లో ఖాళీగా ఉన్న ఆరు బెర్తుల కోసం డజన్ మంది ఎమ్మెల్యేలు పోటీపడుతున్నారు. సామాజిక సమీకరణాలు కుదరకపోవడంతో క్యాబినెట్ విస్తరణ  వాయిదాపడుతూ  వస్తోంది. ఇక పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్‌కుమార్‌గౌడ్ కూడా బాధ్యతలు చేపట్టి ఎనిమిది నెలలు గడుస్తున్నా పాత కార్యవర్గంతోనే నెట్టుకొస్తున్నారు.

నాలుగైదు రోజుల క్రితమే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్ మూడు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండి పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జ్ కేసీ వేణుగోపాల్‌తో సమావేశమై మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గం కూర్పుపై చర్చించారు. పీసీసీ కార్యవర్గం విషయంలో అధిష్ఠానం ఆమోదం తెలిపిందని, మంత్రి పదవుల విషయంలోనే కొలిక్కిరాకపోవడం తో ప్రకటన వాయిదా పడిందని పార్టీవర్గాలు చెబుతున్నాయి. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అందుబాటులో లేకపోవడంతో ఈ నెల 30న మరోసారి ఢిల్లీకి రావాలని సూచించడంతో.. శుక్రవారం సీఎం, పీసీసీ చీఫ్ ఢిల్లీకి వెళ్లనున్నారు.  

సామాజిక సమీకరణలే కీలకం.. 

మంత్రివర్గవిస్తరణలో సామాజిక సమీకరణ అంశం బలంగా వినిపిస్తోంది. ఖాళీగా ఉన్న ఆరు బెర్తుల్లో బీసీల్లో ఇద్దరికి అవకాశం కల్పించాలని డిమాండ్ వినిపిస్తోంది. స్వయంగా పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌నే బీసీలకు సముచిత స్థానం కల్పించాలని పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నారు. తెలంగాణలో అతిపెద్ద సామాజికవర్గమైన మాదిగలకు  మంత్రివర్గంలో చోటు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారు. ఎస్సీల నుంచి డిప్యూటీ సీఎంగా భట్టివిక్రమార్క, స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌కుమార్, మంత్రిగా దామోదర రాజనరసింహ ఉన్నారు.

ఎస్సీ మాల సామా జిక వర్గానికి చెందిన వివేక్ వెంకటస్వామి మంత్రిపదవి కోసం పట్టుబడుతున్నారు. వివేక్ కుటుంబంలో ఇప్పటికే వినోద్ ఎమ్మెల్యేగా ఉండగా, ఆయన తనయుడు వంశీ పెద్దపల్లి ఎంపీగా ప్రాతినిధ్యం వహి స్తున్నారు. ఒక కుటుంబంలో ముగ్గురు ప్రజాప్రతినిధులు ఉండగా, వివేక్‌కు మంత్రి పదవి ఎలా ఇస్తారనే ప్రశ్నలు సొంత పార్టీ నుంచే ఉత్పన్నమవుతున్నాయి. అదిలాబాద్ జిల్లా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు కూడా మంత్రి కావాలని పట్టుబడుతున్నారు.

వివేక్, ప్రేమ్‌సాగర్‌రావు ఇద్దరు ఆదిలాబాద్ జిల్లాకు చెందినవారే కావడంతో.. ఎవరికి అవకాశం దక్కుతుందనే ఉత్కంఠ నెలకొన్నది. బీసీ సామాజికవర్గం నుంచి మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరిముదిరాజ్ పేరు మొదటి నుంచి వినిపిస్తోంది. తెలంగాణలో బలమైన బీసీ సామాజిక వర్గానికి చెం దిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఎస్టీ లంబాడా సామాజికవర్గానికి చెందిన దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్, ప్రభుత్వ విప్ రామచంద్రనాయక్ మంత్రి పదవులను ఆశిస్తున్నారు. 

రెడ్డిల నుంచి ఒకరికా..? ఇద్దరికా..? 

రెడ్డి సామాజికవర్గం నుంచి మంత్రి పదవి కోసం ఐదారుగురు పోటీపడుతున్నారు. ప్రధానంగా నల్లగొండ జిల్లా  మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, నిజామాబాద్ జిల్లాకు చెందిన సుదర్శన్‌రెడ్డి, వరంగల్ జిల్లాకు చెందిన దొంతి మాధవరెడ్డి మంత్రి పదవి కోసం పోటీపడుతున్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన సుదర్శన్ రెడ్డికి లైన్‌క్లియర్ అయినట్లు ప్రచారం సాగుతోంది.

అయితే రాజగోపాల్‌రెడ్డి మాత్రం తనకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఒత్తిడి చేస్తున్నారు. రాజగోపాల్‌రెడ్డి సొంత అన్న వెంకట్‌రెడ్డి మంత్రిగా ఉండగా, తమ్ముడు రాజగోపాల్‌రెడ్డికి మంత్రివర్గంలో చోటిస్తే మిగతా సామాజికవర్గాల నుంచి వ్యతిరేకత వస్తుందనే భయం కాంగ్రెస్‌ను వెంటాడుతోంది. ఒకవేళ రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడం కుదరకపోతే నేరుగా రాహుల్‌గాంధీతో మాట్లాడిచ్చే అవకాశం లేకపోలేదనే చర్చ జరుగుతోంది.  

మాది న్యాయమైన డిమాండ్: మాదిగ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు 

మంత్రివర్గంలో స్థానం కల్పిచాలన్నది తమది న్యాయమైన డిమాండ్ అని, మాదిగలకు న్యాయం జరగాలంటే మంత్రివర్గంలో మాదిగ సామాజికవర్గ ప్రతినిధి ఉండాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, మందుల సామేలు, కవ్వంపల్లి సత్యనారాయణ, లక్ష్మీకాంతరావు అన్నారు. గురువారం ఢిల్లీలోని తెలంగాణభవన్ వద్ద వారు మీడియాతో మాట్లాడారు.. సీఎం రేవంత్‌రెడ్డి, మీనాక్షినటరాజ్, మహేశ్‌కుమార్‌గౌడ్‌కు చెప్పాకనే ఢిల్లీకి వచ్చి కేసీ వేణుగోపాల్‌ను కలిసి మాదిగలకు మంత్రివర్గంలో చోటివ్వాలని కోరామన్నారు.