కేంద్ర మంత్రులకు లేఖలు రాసిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-II విస్తరణ(Hyderabad Metro Rail Phase-II Expansion)కు అనుమతులు మంజూరు చేయడంతో పాటు, మెట్రో ఫేజ్-Iను తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) కేంద్ర మంత్రులకు లేఖలు రాశారు. ఈ మేరకు కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కి, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి విడివిడిగా లేఖలు పంపారు.
ఇటీవల 2026 జూన్ 23, 24 తేదీలలో కేంద్ర మంత్రులతో జరిగిన ఉన్నత స్థాయి సమావేశాల్లో తీసుకున్న కీలక నిర్ణయాలను ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. ఆ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల ప్రకారం మెట్రో ఫేజ్-I ఆస్తుల విలువను నిర్ధారించడం (Valuation), అధిక వడ్డీ రుణాల పునర్వ్యవస్థీకరణ (Refinancing) బాధ్యతలతో పాటు, ఫేజ్-II విస్తరణకు అవసరమైన దీర్ఘకాలిక ఆర్థిక వనరుల సమీకరణపై సమగ్ర అధ్యయనం నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వ నోడల్ ఏజెన్సీ అయిన ఎస్బీఐ క్యాప్స్ (SBICAPS)ను నియమించాలని ఉమ్మడిగా అంగీకరించిన విషయాన్ని ప్రస్తావించారు.
అయితే, ఈ విషయంలో కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇప్పటివరకు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (Terms of Reference)ను ఖరారు చేయకపోవడం, ఎస్బీఐ క్యాప్స్కు అధికారికంగా బాధ్యతలు అప్పగించడంలో జాప్యం జరగడంపై ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ జాప్యం వల్ల హైదరాబాద్ మెట్రో(Hyderabad Metro) ఫేజ్-I నిర్వహణలో రోజువారీ ఇబ్బందులు, అనిశ్చితి ఎదురవుతున్నాయని, అలాగే ఫేజ్-II డీపీఆర్ల ఆమోదం, నిధుల సమీకరణ ప్రక్రియలు ఆలస్యమవుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
ఫలితంగా ప్రాజెక్టు అమలు మరింత వాయిదా పడటంతో పాటు వ్యయం గణనీయంగా పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. హైదరాబాద్ భవిష్యత్ ప్రజా రవాణా అవసరాలకు అత్యంత కీలకమైన మెట్రో ఫేజ్-II విస్తరణ పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యం కాకూడదన్నారు. ఈ విషయంలో ఇద్దరు కేంద్ర మంత్రులు వ్యక్తిగతంగా జోక్యం చేసుకుని ఎస్బీఐ క్యాప్స్ నియామక ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలని కోరారు. తద్వారా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తీసుకున్న నిర్ణయాలు వేగంగా అమలై, మెట్రో ఫేజ్-I స్వాధీనం ప్రక్రియ పూర్తికావడంతో పాటు ఫేజ్-II మెట్రో విస్తరణ(Metro Expansion) పనులు ఎలాంటి జాప్యం లేకుండా ముందుకు సాగేందుకు వీలుకలుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.






