calender_icon.png 30 May, 2025 | 10:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రశీదు కావాలంటే బస్తాకు 2 కిలోలు కటింగ్?

30-05-2025 12:00:00 AM

ధాన్యం కొనుగోళ్ళలో కొత్త దోపిడీ మిల్లుల ఎదుట రైతుల ఆందోళన

మహబూబాబాద్, మే 29 (విజయ క్రాంతి): ధాన్యం కొనుగోళ్ల దోపిడీలో మరో కొత్తకోణం బయటి పడింది. ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాల్లోనే తరుగు పేరుతో అదనంగా తూకం వేసి రైతుల ధాన్యాన్ని దోపిడీ చేస్తుండగా, ఇప్పుడు కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లుకు వచ్చిన ధాన్యాన్ని దింపుకున్నట్లు రశీదు (ఎకనాలెడ్జిమెంట్) ఇవ్వడానికి 40 కిలోల బస్తాకు 2 కిలోల చొప్పున మినహాయించుకుంటామని రైస్ మిల్లు యజమాని తిరకాసు పెడుతున్నారని గురువారం మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో రైతులు ఆందోళనకు దిగారు.

మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండలం పోచంపల్లి మహిళ గ్రామైక్య సంఘం నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రంలో గండ్లకుంట, రామోజీ తండా కు చెందిన రైతులు లకావత్ సోమ్లా, మంగీ లాల్, జాటోత్ బాలాజీ, నీలమ్మ, లక్ష్మి ధాన్యం విక్రయించారు. కొనుగోలు కేంద్రం నిర్వాహకులు ఈనెల 24న ఒక లారీ ద్వారా ఈ రైతులకు చెందిన 932 క్వింటాళ్ల ధాన్యా న్ని కేసముద్రంలోని ఓం సాయి ఇండస్ట్రీస్ కు పంపింది.

మిల్లు యజమాని లారీ ద్వారా వచ్చిన ధాన్యాన్ని దిగుమతి చేసుకున్నాడు. అయితే ధాన్యం దిగుమతి చేసుకున్న తర్వాత ధాన్యం పంపిన ఐకెపి కేంద్రానికి దిగుమతి చేసుకున్నట్లు రసీదు (ఎకనాలెడ్జ్మెంట్) పంపకుండా తొక్కి పెట్టాడు. ధాన్యం తడిసిందని, నాణ్యత సరిగా లేదని తిరకాసు పెట్టి కొనుగోలు కేంద్రానికి బిల్లు ఇవ్వడం కుదరదని కొనుగోలు నిర్వాహ కులకు సమాచారం ఇచ్చాడు.

ధాన్యం విక్రయించిన రైతులు కొనుగోలు కేంద్రానికి వెళ్లి ట్యాబ్ ద్వారా ఆన్లైన్ చేయించుకోవ డానికి వెళ్లగా, మీ ధాన్యం దించుకోవడానికి రైస్ మిల్లు యజమాని అంగీకరించడం లేదని, మీరు వెళ్లి మీరు యజమానితో మాట్లాడుకోండని కొనుగోలు కేంద్రం నిర్వాహకులు సదరు రైతులకు ఈ విషయం చెప్పి మీరు మీరు తేల్చుకోండనీ చేతులు ఎత్తేశారు. దీంతో ధాన్యం విక్రయించిన రైతులు గురువారం సదరు మిల్లుకు రాగా, మీరు లారీ ద్వారా పంపిన ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని, బస్తాకు రెండు కిలోల చొప్పున తగ్గించి బిల్లు చేస్తామని చెప్పడంతో రైతులు నిరసనకు దిగారు.

మేం పంపిన ధాన్యం పూర్తిగా ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యత ప్రమాణాల ప్రకారం ఉందని, మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత తిరకాసు పెట్టడం సరికాదని వాగ్వాదానికి దిగారు. అయితే మీరేం చేసుకుంటారో చేసుకోండి.. రెండు కిలోలు తరుగు పేరుతో మినహాయించుకోవడానికి అంగీకరిస్తే తప్ప రశీదు ఇచ్చేది లేదని రైసు మిల్లు యజమాని ఖరాఖండిగా చెప్పడంతో.. మా దాన్యం మాకు ఇవ్వండి.. కోత పెడితే కుదరదని ఆందోళనకు దిగిన రైతులు ఈ విషయాన్ని విలేకరులకు, అధికారులకు తెలియజేశారు.

దీంతో ఘటన స్థలికి వెళ్ళిన పోలీసులు, విలేకరులకు తమకు మిల్లు యజమాని పెడుతున్న ఇబ్బందులను వివరించారు. మేము ఇచ్చిన ధాన్యాన్ని దింపుకున్న మిల్లరు, ఇప్పుడు మా ధాన్యం సరిగా లేదని చెప్పడం ఏమిటంటే ప్రశ్నించారు.

అయితే ఈ విషయం పోలీసులకు, ఉన్నతాధి కారులకు, మీడియాకు తెలియడంతో సదరు మిల్లు యజమాని గొడవ పెద్దగా చేసుకోవడం ఎందుకని, గొడవకు దిగిన రైతులకు ఎలాంటి కోతలు లేకుండా ధాన్యానికి రశీదు ఇచ్చి పంపడంతో గొడవ సద్దుమణిగింది.