calender_icon.png 30 May, 2025 | 7:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

'గౌరవెల్లి'ని ఇంకెప్పుడు కంప్లీట్ చేస్తరు?

29-05-2025 11:36:35 PM

కాల్వలు పూర్తి చేసి నీళ్లివ్వకపోతే ఆందోళన చేస్తం..

సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి..

హుస్నాబాద్ (విజయక్రాంతి): "ఇక చాలు ఈ నిర్లక్ష్యం. మా రైతన్నల ఆశలు ఆవిరవుతున్నాయి" అంటూ గౌరవెల్లి రిజర్వాయర్‌(Gouravelli Reservoir)ను తక్షణమే పూర్తి చేయాలని, హుస్నాబాద్ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నాన్ని సాకారం చేయాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి(CPI National Executive Member Chada Venkata Reddy) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వెంటనే భూసేకరణ చేపట్టి ఎడమ కాల్వ నిర్మాణాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. గురువారం ఆయన పార్టీ కార్యకర్తలు, రైతులతో కలిసి గౌరవెల్లి రిజర్వాయర్‌ను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... "వైఎస్. రాజశేఖరరెడ్డి హయాంలో సీపీఐ పోరాట ఫలితంగా శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్టు 17 సంవత్సరాలు గడిచినా నేటికీ పూర్తి కాలేదు. ఇది ప్రభుత్వాల ఘోర వైఫల్యం" అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో "రీడిజైనింగ్" పేరుతో ప్రాజెక్టు ఎత్తు, సామర్థ్యాన్ని పెంచి అనవసరంగా కాలయాపన చేశారని విమర్శించారు. "ప్రజల ఆశలు ఇంకా తీరలేదు. భూనిర్వాసితుల సమస్యలు ఎటూ తేలలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇకనైనా మేల్కొని ఈ ప్రాజెక్టుపై దృష్టి సారించి వెంటనే పూర్తి చేయాలి" అని ఆయన డిమాండ్ చేశారు. భూసేకరణ వేగవంతం చేసి, ఎడమ కాల్వ నిర్మించి రైతులను ఆదుకోవాలన్నారు.

రైతుల వినతిపత్రాలు

రిజర్వాయర్ పరిశీలనకు ముందు రేగొండ, గోవర్ధనగిరి, మల్ చెరువు తండా, నర్సింగ్ తండాలకు చెందిన రైతులు చాడ వెంకటరెడ్డికి తమ సమస్యలను వివరిస్తూ వినతిపత్రాలు సమర్పించారు. సాగునీరు అందక పడుతున్న కష్టాలు, భూసేకరణ ఆలస్యంపై వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. చాడ వెంట ఆ పార్టీ జిల్లా కార్యదర్శి పవన్, కార్యవర్గ సభ్యుడు యెడల వనేశ్, అక్కన్నపేట మండల కార్యదర్శి కొమ్ముల భాస్కర్, సహాయ కార్యదర్శి బొజ్జపురి రాజు, ఏఐఎస్ఎఫ్ సిద్దిపేట జిల్లా కార్యదర్శి జేరిపోతుల జనార్దన్ తదితరులున్నారు.