04-06-2025 05:21:39 PM
ఆస్పత్రిలో ప్రసవాల సంఖ్య పెంచాలి..
జిల్లా కలెక్టర్ పమేల సత్పతి..
హుజురాబాద్ (విజయక్రాంతి): మానవియా కోణంలో వైద్యులు రోగులకు సేవలు అందించాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేల సత్పతి(District Collector Pamela Satpathy) అన్నారు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని ఏరియా హాస్పిటల్ ని బుధవారం సందర్శించినారు. ఈ సందర్భంగా ఆస్పత్రుల నెలవారి ఓపి రిజిస్టర్ పరిశీలించారు. డయాలసిస్ కేంద్రం, ఐసీయూ, వార్డులు, నవజాత శిశువుల వార్డు సందర్శించి పిల్లలకు వచ్చిన సమస్య గురించి అడిగి తెలుసుకున్నారు. హాస్పటల్లో నార్మల్ డెలివరీ అధిక సంఖ్యలో చేసేందుకు వైద్యులు కృషి చేయాలన్నారు. రేడియాలజిస్ట్, డెంటిస్ట్, లేబర్ రూమ్ వార్డుల పరిశీలించి గర్భిణీ లతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆస్పత్రిలో అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయని ప్రజలు ప్రైవేటు మెడికల్ షాప్ లలో వేల రూపాయలు ఖర్చుతో కొనుగోలు చేస్తున్నారని అన్నారు. బిపి షుగర్ సంబంధిత మందులు ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వచ్చే రోగులకి ప్రజలకి అవగాహన కల్పించి ఉచిత మందులు అందజేయాలన్నారు. ఆరోగ్యమహిళ క్యాంపును వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. మెప్మా ఐకెపి సిబ్బంది ద్వారా ఆరోగ్య మహిళ ఉచిత వైద్య పరీక్ష పట్ల మహిళలకు అవగాహన కల్పించి క్యాంపును సద్వినియోగం చేసుకునేలా చూడాలని అన్నారు.
ఈ క్యాంపు ద్వారా సుమారు 50 వేల రూపాయల ఖరీదు చేసే 47 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తున్న విషయం మహిళాలోకి తీసుకెళ్లాలని తెలిపారు. 40 సంవత్సరాలు దాటిన మహిళలకు అన్ని రకాల పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి బీపీ,షుగర్, థైరాడ్ వంటి మందులను అందించాలని సూచించారు. 108 సేవలకు ఎటువంటి అంతరాయం లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని అవసరమైన సౌకర్యాలు సమకూర్చుకోవాలని ఆదేశించారు. అనంతరం ఆస్పత్రి ఆవరణలో అడిషనల్ కలెక్టర్ ప్రబులు దేశరాయి తో కలిసి మొక్కలు నాటారు. ఈ సమావేశంలో డిసిహెచ్ చంద్రశేఖర్, ఆసుపత్రి సూపర్డెంట్ నారాయణరెడ్డి, ఆర్ ఎం ఓ రమేష్, జమ్మికుంట సూపర్డెంట్ శ్రీకాంత్ రెడ్డి, డిప్యూటీ డిహెచ్ఓ చందు, ఆర్డీవో రమేష్ బాబు, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.