04-06-2025 05:17:52 PM
ఫలించిన పోలీసుల కృషి..
1,333 ఫోన్లు బాధితుల చేతికి..
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా పోలీసులు(Nagarkurnool District Police) మరో అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు. జిల్లాలోని ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలోని సెల్ఫోన్స్ పోగొట్టుకున్న బాధితులు ఫిర్యాదులు చేయగా వాటిపై ప్రత్యేక దృష్టి సారించిన జిల్లా పోలీసు యంత్రాంగం సాంకేతికతను ఉపయోగించి కొన్ని నెలలుగా మొబైల్ ఫోన్లను ట్రేస్ చేసి వాటిని తిరిగి బాధితులకు స్వయంగా అందజేశారు. సుమారు రూ.18 లక్షల విలువైన 100 మొబైల్స్ తిరిగి అప్పగించడంతో బాధితుల ముఖాల్లో ఆనందం వెళ్లువిరిసింది. తమ విలువైన సమాచారాన్ని డేటాను స్టోర్ చేసుకున్న ఫోన్లు పోగొట్టుకొని అనేక ఇబ్బందులకు గురైన బాధితులకు ఫోన్ రికవరీ కావడంతో జిల్లా పోలీసు యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
బుధవారం బాధితులకు స్వయంగా జిల్లా ఎస్పీ గైక్వార్డు వైభవ్ రఘునాథ్ సెల్ఫోన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సెల్ఫోన్ పోగొట్టుకున్న బాధితులు గాబరా పడాల్సిన అవసరం లేదని పూర్తి ఆధారాలు వివరాలతో కూడిన ఫిర్యాదు చేస్తే తప్పకుండా ఫోన్ వెతికి అప్పజెప్పడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 3,854 మంది సెల్ ఫోన్లు పోయినట్టు ఫిర్యాదులు చేయగా వాటిలో 1,333 మొబైల్స్ను ఇప్పటికే రికవరీ చేసినట్లు తెలిపారు. మిగిలినవి కూడా త్వరలో అందజేయనున్నట్టు చెప్పారు.