05-07-2025 12:00:00 AM
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య
సంగారెడ్డి, జూలై 4(విజయక్రాంతి): భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం పోరాడి నెలకొరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య చూపిన స్ఫూర్తిని కొనసాగించాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య అన్నారు. శుక్రవారం దొడ్డి కొమురయ్య 79వ వర్దంతి సందర్బంగా పోతిరెడ్డి పల్లి చౌరస్తా కి సమీమలోవున్న దొడ్డి కొమురయ్య విగ్రహానికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, ఎమ్మెల్సీ అంజిరెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..దొడ్డి కొమురయ్య జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వ ఆదేశాలను అనుసరిస్తూ జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య వర్ధంతి కార్యక్రమాన్నీ అధికారికంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. తెలంగాణ సాయుధ పోరాటానికి తొలి అమరత్వాన్ని ఇచ్చి స్ఫూర్తినిచ్చింది దొడ్డి కొమురయ్య అని అన్నారు.
ఆయన చూపిన పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని తెలిపారు. మహనీయుల ఆశయాలను నేటితరం ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ అధికారి జగదీష్, వెనుకబడిన తరగతుల కుల సంఘం నాయకుల అధ్యక్షుడు మల్లికార్జున్ పాటిల్, పుష్ప నగేష్ యాదవ్, బీరయ్య యాదవ్, ప్రభు గౌడ్ సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గోన్నారు.