సురంగల్ ప్రభుత్వ పాఠశాలకు రూ.లక్ష విరాళం
కౌన్సిలర్ శ్రీధర్ చొరవతో ముందుకొచ్చిన 13వ వార్డు ఇన్చార్జ్
మొయినాబాద్, జూన్ 3 (విజయక్రాంతి): మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ని సురంగల్ ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ 13వ వార్డు ఇన్చార్జ్ యాలాల జైపాల్ రెడ్డి రూ.1 లక్ష విరాళంగా అందజేశారు. పాఠశాల భవనానికి నూతనంగా రంగులు వేయించి విద్యార్థులకు మెరుగైన వా తావరణం కల్పించాలనే ఉద్దేశంతో ఈ ఆర్థిక సహాయాన్ని అందించినట్లు తెలిపారు.
పాఠశాల భవనం పాతబడిన పరిస్థితిని 14వ వార్డు కౌన్సిలర్ కర్రల శ్రీధర్ జైపాల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించి విరాళం ప్రకటించారు. భవిష్యత్తులో కూడా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ జహీర్ మాట్లాడుతూ, విద్యాభివృద్ధికి ముందుకొచ్చి సహాయం చేసిన జైపాల్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
పాఠశాల అభివృద్ధికి అందించిన ఈ సహాయం విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. కౌన్సిలర్ కర్రల శ్రీధర్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ప్రతిభలో ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు ఏమాత్రం తీసిపోరని అన్నారు. అయితే సౌకర్యాలు, మౌలిక వసతుల పరంగా ప్రభుత్వ బడులు మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలలు కూడా ఆకర్షణీయంగా, ఆధునికంగా ఉండాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.






