మోసపోయి.. గోసపడొద్దు
- ఆరు గ్యారంటీలపై కాంగ్రెస్ను నిలదీయాలి
- బీజేపీ కుల, మత రాజకీయాలను విశ్వసించొద్దు
- ఆ రెండు పార్టీలకు బుద్ధిచెప్పండి
- బీఆర్ఎస్ నేత కేటీఆర్ పిలుపు
రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి 6 (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల్లో మరోసారి మోసపోయి గోసపడవద్దని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ప్రజలకు పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో శుక్రవారం కేటీఆర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలం గాణ ప్రజలకు చేస్తున్న అన్యాయాలపై కేటీఆర్ ఈ సందర్భంగా విరుచుకుపడ్డారు.
2023లో కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలు నమ్మి ప్రజలు ఓటు వేసి రెండే ళ్లుగా గోసపడుతున్నారని తెలిపారు. ఇప్పటికే మూడుసార్లు రైతుబంధు ఎగ్గొట్టా రని, 6 గ్యారంటీలు అమలు చేయడం లేద ని విమర్శించారు. కల్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఎటుపోయాయని, మహిళలకు 2500 ప్రతినెలా ఎందుకు ఇవ్వడంలేదని, విద్యార్థినులకు స్కూటీలు ఇచ్చారా అని ప్రశ్నించారు. ఆరు గ్యారెంటీల్లో కనీసం ఒక్కటైనా సక్రమంగా అమ లు చేశారా? అంటూ అధికార పార్టీని నిలదీశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత బస్సు అని ప్రజలను మోసగిస్తుందని, మహిళలకు ఉచిత ప్రయాణం అంటూ మగవారి కి డబుల్ చార్జీలు వసూలు చేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఓట్లకు వేలాది రూపాయలు ఇచ్చేం దుకు సిద్ధమయ్యారని, బరాబర్ డబ్బులు తీసుకోండని, ఓటు మాత్రం కారు గుర్తుకు వేయాలని కోరారు. వేములవాడ ఎమ్మె ల్యే ఆది శ్రీనివాస్ గత ఎన్నికల సందర్భం గా బాండ్ పేపర్ మీద రాసిచ్చిన హామీల అమలు ఏమైందని కేటీఆర్ నిలదీశారు.
ఈసారి తనకు ఓటు వేయకుంటే చనిపోతానని, నాలుగుసార్లు ఓడిపోయినా అంటూ సానుభూతి డైలాగులతో ప్రజలను మభ్యపెట్టిన ఆది శ్రీనివాస్.. ఆ తర్వా త హామీల అమలునుంచి మొదలుకొని అభివృద్ధి వరకు అడ్రస్ లేకుండా పారిపోయాడని విమర్శించారు. కేవలం మంత్రి పదవి కావాలని రేవంత్రెడ్డి కాళ్లు పట్టుకుంటున్న ఆది శ్రీనివాస్ వేములవాడకు ఏమి చేశారో చెప్పాలని ప్రశ్నించారు.
దేవుళ్ల పేరుతో బీజేపీ రాజకీయం..
ఎన్నికలు రాగానే దేవుళ్ల పేరుతో రాజకీయం చేయడం బీజేపీకి అలవాటైపోయిందని కేటీఆర్ విమర్శించారు. దేవుళ్లు, కులం, మతం పేరు చెప్పి ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు ప్రయత్నిస్తున్నారని, బీజేపీ నేతల దొంగ మాటలను ప్రజలు విశ్వసించొద్దని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఇదే పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి ఒక్క రూపాయి కేటాయించారా అని కేటీఆర్ ప్రశ్నించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా తెలంగాణకు ఎలాంటి లబ్ధి చేయలేదని కేటీఆర్ తెలిపారు.
ఇంటికి పదిహేను లక్షల చొప్పున ఇస్తానని చెప్పిన మోదీ ఆ తర్వాత ఇచ్చిన హామీలన్నింటినీ పక్కన పెట్టారని కేటీఆర్ ఆరోపించారు. ఏం చేశారని బీజేపీకి ఓటువేయాలో ఆ పార్టీ నాయకులను నిలదీ యాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ప్రజా శ్రేయస్సుకు పాటు పడుతున్న బీఆర్ఎస్కు మున్సిపల్ ఎన్నికల్లో పట్టం కట్టాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కేటీఆర్ వెంట మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులతో పాటు బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ చార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహారావు ఉన్నారు.






