calender_icon.png 18 June, 2025 | 5:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎవరినీ వదలొద్దు

18-06-2025 12:50:52 AM

ఫోన్ ట్యాపింగ్ రాజకీయ కుట్ర

  1. 2018ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి కారణమదే
  2. 2023 ఎన్నికల్లో ఓడిపోతామనే అప్పటి ప్రభుత్వం హార్డ్‌డిస్క్‌లు ధ్వంసం చేయించింది
  3. నిందితులను కఠినంగా శిక్షించాలి
  4. టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ సంచలన వ్యాఖ్యలు
  5. కాంగ్రెస్ నేతలతో కలిసి సిట్ ఎదుట వాంగ్మూలం

హైదరాబాద్, సిటీబ్యూరో జూన్ 17 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో తమ ఫోన్‌లను ట్యాప్ చేసినట్లు అనుమానం రావడంతోనే సీఎస్‌కు ఫిర్యాదు చేసినట్లు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ తెలిపారు. ఈ కేసులో బాధితుడిగా టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ మంగళవారం జూబ్లీహిల్స్ పోలీసుల ఎదుట వాంగ్మూలం ఇచ్చారు.

అలాగే ఎంపీ అనిల్‌కుమార్‌యాదవ్, గద్వాల జడ్పీ మాజీ చైర్‌పర్సన్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి సరిత కూడా వాంగ్మూలం ఇచ్చారు. అనంతరం మహేశ్‌కుమార్‌గౌడ్ మీడియాతో మాట్లాడు తూ.. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేశారని, వందలాది మంది నాయకుల గోప్యతను కాలరాశారని మండిపడ్డారు.

రాజకీయ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేయడం హేయమైన చర్య అని, ఆనాటి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సిగ్గుతో తలదించుకోవాలన్నారు. ఏ రాజకీయ నేత, పార్టీ ఉండకూ డదని, తామే శాశ్వతంగా ఉండాలనే చెడు ఆలోచనతో ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి ఫోన్ ట్యాపింగే కారణమని ఆయన ఆరోపించారు.

తమ కదలికలన్నీ ట్రాక్ చేశారని, నక్సలైట్ల సానుభూతిపరుల పేరుతో ఫోన్లు ట్యాప్ జరిగాయని తెలిపారు. 2023ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసి ప్రభాకర్‌రావు, అప్పటి చీఫ్ సెక్రటరీ కలిసి హార్డ్‌డిస్క్‌లను ధ్వంసం చేయించారని మహేశ్‌కుమార్‌గౌడ్ ఆరోపించారు. దేశ చరిత్రలో ఇంత పెద్దఎత్తున ఫోన్లు ట్యాప్ చేయడం ఇదే ప్రథమం అన్నారు.

భవిష్యత్‌లో మరే ప్రభుత్వం కూడా ఇలాంటి దుశ్చర్యకు పాల్పడకుండా ఉండాలంటే ఈ కేసులో నిందితులకు కఠినశిక్ష పడాలని, ఎవ్వరినీ ఉపేక్షించవద్దని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. హైకోర్టు, సుప్రీంకోర్టు ఈ కేసును తీవ్రంగా పరిగణించి నిందితులను శిక్షించాలని ఆయన కోరారు. 

జూబ్లీహిల్స్ పీఎస్ వద్ద ఉద్రిక్తత..

కాంగ్రెస్ నేతలు సిట్ విచారణకు హాజరైన నేపథ్యంలో జూబ్లీ హిల్స్ పీఎస్ వద్దకు కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. పీఎస్‌లోనికి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకుని వారిని బయటకు పంపించివేశారు. ఈ క్రమంలో స్వల్ప తోపులాట జరిగింది. కాంగ్రెస్ శ్రేణుల హడావుడి నేపథ్యంలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.