11-06-2025 07:19:38 PM
మందమర్రి (విజయక్రాంతి): సింగరేణి కార్మికులు గైర్హాజరు పేరిట ఉద్యోగాలు కోల్పోకుండా విధులకు సక్రమంగా హాజరు కావాలని కేకే-5 గనీ మేనేజర్ శంభు నాథ్ పాండే(Manager Shambhu Nath Pandey) కోరారు. బుధవారం కేకే-5 గనిపై గైర్హాజర్ కార్మికులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఏ సంస్థలో లేని విధంగా సింగరేణిలో మంచి వేతనాలు ఉన్నాయని తెలిపారు. కార్మికులకు విధుల వద్ద ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటిని తమ దృష్టికి తీసుకురావాలన్నారు.
అంతే కాకుండా ఎలాంటి సమస్యలు ఉన్నా ఇతరులకు చెప్పడం ద్వారా పరిష్కారానికి మార్గం దొరుకుతుందని సూచించారు. కొత్తగూడెం కార్పొరేట్ కార్యాలయం నుండి గైర్హాజర్ కు సంబంధించి సర్కులర్ వచ్చిందని, దీని ప్రకారం భూగర్భ కార్మికులు ప్రతినెల 16 మస్టర్లు, ఊపరితల కార్మికులు 20 మస్టర్లు చేయాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. గైర్హాజర్ కార్మికులకు ప్రతినెల కౌన్సిలింగ్ ఉంటుందని, తరచూ విధులకు గైర్హాజర్ అయితే మస్టర్లు లేక డిస్మిస్ అయ్యే అవకాశాలు అధికంగా ఉండి డిస్మిస్ కార్మికుల కుటుంబాలు రోడ్డున పడతాయని దీనిని అర్థం చేసుకోవాలని కోరారు.
అనారోగ్యంతో పాటు ప్రమాదాల బారిన పడి గాయాలు మానిన ఒళ్ళు నొప్పులు ఉన్నటువంటి కార్మికులు వారి పరిస్థితిని తనతో పాటు పై అధికారుల దృష్టికి తీసుకువెళితే కొద్ది రోజులు సర్ఫేస్ లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని అన్నారు. పని లేకుండా విధులకు గైర్హాజర్ అవుతూ అటు వారి కుటుంబాలకు ఇటు సంస్థకు భారం కావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వెంటిలేషన్ అధికారి శంకర్, సంక్షేమ అధికారిని ఆకుల రవళి, ఆఫీస్ సూపర్డెంట్ బుచ్చయ్యలు పాల్గొన్నారు.