విధుల పట్ల నిర్లక్ష్యం వహించవద్దు
– గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డీఈఓ గోడం చందన్
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లాలోని ఆశ్రమ బాలుర, బాలికల పాఠశాలలను గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డీఈఓ గోడం చందన్ ఆకస్మికంగా సందర్శించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని పీఎంఆర్సీలో స్కూల్ కాంప్లెక్స్ ఎస్సీఆర్పీల సమావేశంలో మాట్లాడారు. గిరిజన విద్యార్థుల విద్యా వికాసానికి ఉపాధ్యాయులు కచ్చితంగా పాఠశాల సమయానికి హాజరై బోధన నిర్వహించాలని సూచించారు. కృత్యాధార బోధన పద్ధతిని అనుసరించి బోధన చేయాలని, ఉపాధ్యాయులు డైరీని తప్పనిసరిగా ఉపయోగించాలని తెలిపారు.
పాఠశాలకు వచ్చిన స్కూల్ గ్రాంట్ నిధులను పూర్తిగా పాఠశాల అభివృద్ధికి వినియోగించాలని, విద్యార్థులకు యూనిఫామ్లను త్వరితగతిన పంపిణీ చేయాలని ఆదేశించారు. మధ్యాహ్న భోజనాన్ని మెనూ ప్రకారం అందించాలని, పాఠశాల వాతావరణం ఆహ్లాదకరంగా ఉండేలా ఉపాధ్యాయులు బాధ్యత వహించాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు “అమ్మ ఆదర్శ పాఠశాల” కార్యక్రమాన్ని పారదర్శకంగా అమలు చేయాలని, విద్యార్థుల్లో కనీస ఇంగ్లీష్ సామర్థ్యాలు పెంపొందించే దిశగా కృషి చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా డిప్యూటీ డీఈఓగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి జిల్లా కేంద్రానికి విచ్చేసిన గోడం చందన్ను శాలువా, పుష్పగుచ్ఛాలతో ఘనంగా సన్మానించారు.ఈ సమావేశంలో గిన్నెధరి, రొంపల్లి ఆశ్రమ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు నైతం కృష్ణరావు, మాడావి గోపాల్, స్కూల్ కాంప్లెక్స్ ఎస్సీఆర్పీలు రాథోడ్ రవీందర్, ఉయిక శంకర్, కూడ్మేత అనంత్, వెడ్మ యశ్వంత్రావు, చౌహాన్ రవీందర్, రాథోడ్ నరేష్, చాహకటి శ్యాంరావు, షెడ్మాకి వెంకటేశం, నందరాం, మాడావి లచ్చు, రాజేశ్వర్, మాడావి పోచాని, మండాడీ ఘగృ, కనక బుచ్చిరాం తదితరులు పాల్గొన్నారు.




