బాల్యవివాహాల నిర్మూలన అందరి బాధ్యత
* నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి
* కోనేరు, జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్స్ సంస్థల ఆధ్వర్యంలో బాల్య వివాహ విముక్త భారత్ రథయాత్ర
అచ్చంపేట: బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతీ ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లురవి పిలుపునిచ్చారు. కోనేరు స్వచ్ఛంద సేవా సంస్థ, జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్స్ సంస్థల ఆధ్వర్యంలో లైన్ డిపార్ట్మెంట్ల సహకారంతో బాల్య వివాహ విముక్తి ప్రచార రథయాత్ర సోమవారం నాగర్ కర్నూల్ జిల్లాలోని బల్మూర్ మండలం తుమ్మ న్పేట్ గ్రామంలో ఎంపీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటికీ బాల్యవివాహాలు జరుగడం ఆందోళనకరమన్నారు. దాన్ని నిర్మూలనకు అవగాహన కల్పించడం చాలా అవసరమన్నారు.
స్వచ్ఛంద సంస్థలు ఆ దిశగా చేస్తున్న ప్రయత్నాలు అభినం దనీయమని కొనియాడారు. వంద రోజుల బాల్యవివాహ విముక్త క్యాంపెయిన్కు అందరూ సహకరించాలని అన్నారు. ‘బాల్యవివాహాలు బాలల భవిష్యత్తును దెబ్బతీస్తాయి. విద్య, ఆరోగ్యం, స్వావలంబనపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. ఈ రథయాత్ర ద్వారా గ్రామాలు, పట్టణాల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తాం. తల్లిదండ్రులు, యువత ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వం, సంస్థలు కలిసి కృషి చేస్తే బాల్యవివాహాలను పూర్తిగా అంతం చేయవచ్చు’ చెప్పారు. కార్యక్రమంలో డిసిసి మాజీ అధ్యక్షులు మావిళ్ళపల్లి విష్ణువర్ధన్ రెడ్డి. కోనేరు సంస్థ ప్రాజెక్టు కోఆర్డినేటర్ ఆంజనేయులు. ఏరియా కోఆర్డినేటర్లు జాకీర్ హుస్సేన్ శ్రీనివాస్ యాదవ్. మోబిలైజర్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.




