సెప్టెంబర్ తొలివారంలో డీఎస్సీ తుది ‘కీ’!
- ఆ తర్వాత జీఆర్ఎల్, 1:3 మెరిట్ జాబితా
- కసరత్తు చేస్తున్న విద్యాశాఖ అధికారులు
- డీఎస్సీ నియామకాల్లో ఎస్సీ వర్గీకరణ లేనట్టే!
హైదరాబాద్, ఆగస్టు 27 (విజయక్రాంతి): సెప్టెంబర్ తొలివారంలో డీఎస్సీ తుది ‘కీ’ వెలువడనున్నది. ఆ దిశగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. అయితే ఈ నెల చివరికల్లా తుది కీ, ఆ తర్వాత ఫలితాలను విడుదల చేయాలని ముం దుగా భావించిన అధికారులు.. ఫలితాల విడుదలకు ఇంకొంత సమయం పడుతుందని చెప్తున్నా రు. వచ్చే నెల మొదటి వారంలో డీఎస్సీ తుది కీని విడుదల చేసి ఆ తర్వాత జనరల్ ర్యాంకింగ్ లిస్టు (జీఆర్ఎల్) జాబితాను విడుదల చేయనున్నట్టు అధికారులు పేర్కొన్నారు. అనంతరం 1:3 నిష్పత్తిలో మెరిట్ లిస్టును ప్రకటించనున్నారు.
ఆ తర్వాత ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియను పూర్తి చేసి ఫైనల్గా ఎంపికైన వారి జాబితా ప్రకటిస్తారు. తుది కీ విడుదల చేసిన తర్వాత టెట్ మార్కులను యాడ్ చేసి మెరిట్ జాబితాను రిలీజ్ చేయనున్నారు. ఈ నెల 13న డీఎస్సీ ప్రాథమిక కీని విద్యాశాఖ విడుదల చేసి ఈ నెల 20వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించింది. 28,500 వరకు అభ్యంతరాలు అందినట్టు విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. 11,062 టీచర్ పోస్టుల భర్తీకి జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు పరీక్షలు జరగ్గా 2,45,263 మంది హాజరయ్యారు. మొత్తంగా టీచర్ నియమక ప్రక్రియను అక్టోబర్ వరకు పూర్తి చేసేందుకు అధికారులు తీవ్ర కసరత్తు చేస్తున్నారు.
నియామకాల్లో ఎస్సీ వర్గీకరణ లేనట్టే!
డీఎస్సీ టీచర్ పోస్టుల నియామకాల్లో ఎస్సీ వర్గీకరణ అమలుపై ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి స్పష్టత లేదని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. దీంతో ఉపాధ్యాయ భర్తీలో ఎస్సీ వర్గీక రణను అమలు చేసే అవకాశం కనిపించడంలేదు. ప్రస్తుతమైతే వర్గీకరణకు అంశాన్ని పరిగణలోకి తీసుకోకుండానే ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఒకవేళ వర్గీకరణ అంశాన్ని లెక్కలోకి తీసుకుంటే న్యాయపర మైన చిక్కులు తలెత్తే ప్రమాదం లేకపోలేదు. దీంతో మొత్తం నియామక ప్రక్రియ ఆలస్యమ య్యే ప్రమాదం ఉందనే చర్చ అధికారిక వర్గాల్లో జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ డీఎస్సీ వరకు ఎస్సీ వర్గీకరణను పక్కన పెట్టి భర్తీ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నారు.
రేపటి నుంచి స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు వెరిఫికేషన్
స్పోర్ట్స్ కోటాలో డీఎస్సీకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 28 నుంచి సెప్టెంబర్ 2 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియను చేపట్టనున్నట్టు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఈవీ నర్సింహారెడ్డి తెలిపారు. నేషనల్, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సర్టిఫికెట్లను అభ్యర్థులు అప్లోడ్ చేసుకోవాలని కోరారు. ఎస్జీటీ, లాంగ్వేజ్ పండిట్ తెలుగు, పీఈటీ, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అన్ని జిల్లాల్లో కలిపి వంద వరకు ఉన్నట్టు తెలిపారు.






