మెరిసిన వైభవ్, ఇషాన్
దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్
బెంగళూరు, సెప్టెంబర్ 1: ప్రతిష్టాత్మక దులీప్ ట్రోఫీ(Duleep Trophy)లో ఈస్ట్ జోన్ ఫైనల్ కు దూసుకెళ్లింది. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో జరిగిన తొలి సెమీ ఫైనల్ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ సెంట్రల్ జోన్పై ఈస్ట్ జోన్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఈస్ట్ జోన్ యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ(Vaibhav Suryavanshi) మొదటి ఇన్నింగ్స్లో 92 పరుగులు, రెండో ఇన్నింగ్స్లో40 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.కెప్టెన్ ఇషాన్ కిషన్ రెండో ఇన్నింగ్స్లో బాధ్యతాయుతంగా ఆడి 39 పరుగులతో అజేయంగా నిలిచాడు.బ్యాటింగ్కు ప్రతికూలమైన వికెట్పై దూకుడైన బ్యాటింగ్తో ఈస్ట్ జోన్కు విజయాన్ని అందించాడు. 45/3 ఓవ్నట్ స్కోర్తో మూడో రోజు ఆటను కొనసాగించిన సెంట్రల్ జోన్.. రెండో ఇన్నింగ్స్లో 50.2 ఓవర్లలో 158 పరుగులకు కుప్పకూలింది.
రెండు జట్ల మధ్య ప్రధాన వ్యత్యాసం వైభవ్ సూర్యవంశీ బ్యాటింగే. 159 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన ఈస్ట్ జోన్.. 39.3 ఓవర్లలో 6 వికెట్లకు 162 పరుగులు చేసింది.సెంట్రల్ జోన్ బౌలర్లలో హర్ష్ దూబే(4/53) నాలుగు వికెట్లు తీసినా ఫలితం లేకపోయింది. సారాన్ష్ జైన్, యశ్ ఠాకూర్ చెరో వికెట్ పడగొట్టారు. వైభవ్ విధ్వంసకర బ్యాటింగ్తో తొలి వికెట్కు 61 పరుగులు జోడించాడు. మహమ్మద్ షమీ విన్నింగ్ షాట్తో విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. దాంతో ఈస్ట్ జోన్ 13 ఏళ్ల తర్వాత దులీప్ ట్రోఫీ ఫైనల్కు దూసుకెళ్లింది.






