04-10-2025 01:46:14 AM
జీఎస్టీ వసూళ్ల వృద్ధి రేటులో దేశంలోనే అట్టడుగుకు
వ్యవసాయం నుంచి రియల్ ఎస్టేట్ వరకూ అన్ని రంగాల్లోనూ అదే తీరు
రెండేళ్ల క్రితం కేసీఆర్ పాలనలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, అక్టోబర్ 3 (విజయక్రాంతి) : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ సంపూర్ణంగా విధ్వంసానికి గురైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు తీవ్రస్థాయిలో విమర్శించారు. తాజాగా సెప్టెంబర్ 2025 నెలలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్ల వృద్ధి రేటులో తెలంగాణ దేశంలోనే అట్టడుగుకు చేరటం దారుణమని అన్నారు. తెలంగాణ ఆర్థిక విధ్వంసానికి సంబంధించిన మరో స్పష్టమైన సూచిక ఇదేనని పేర్కొన్నారు.
సరిగ్గా రెండేళ్ల క్రితం, కేసీఆర్ సమర్థ పాలనలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచిందని గుర్తు చేశారు. జీఎస్టీ వృద్ధిలో ఈ పతనం, రేవంత్ రెడ్డి పరిపాలనలో రాష్ర్ట ఆర్థికవ్యవస్థ ఎంత విధ్వంసం పాలయ్యిందో చెప్పేందుకు ఒక నిదర్శనమని ధ్వజమెత్తారు. గత బీఆర్ఎస్ హయాంలో వ్యవసాయం నుంచి ఐటీ వరకూ అన్ని రంగాలకు రాష్ర్ట ప్రభుత్వం గట్టి దన్ను ఇవ్వడంతో ఆర్థికవ్యవస్థ పరుగులు తీసి, రికార్డులు తిరగరాసిందని తెలిపా రు.
కానీ నేడు కాంగ్రెస్ పాలనలో, పం డుగ వచ్చినా, పబ్బం వచ్చినా కూడా అన్ని రంగాలూ నేలచూపులే చూస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయం నుంచి రియల్ ఎస్టేట్ వరకూ అన్నిరంగాల్లోనూ దైన్యమే తాండవిస్తోందని మండిపడ్డారు. ‘అరాచకత్వం, అవినీతి, అనుభవలేమి కలగలసిన రేవంత్ పాలనలో తెలంగాణ ఆర్థిక పరిస్థితి విధ్వంసానికి గురవుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధ్వంసాన్ని వెంటనే ఆపడానికి చర్యలు తీసుకోవాలి’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు.