03-12-2025 09:41:22 PM
ఎన్నికల సంఘం నియమాలు తప్పనిసరిగా అమలు చేయాలి
సాధారణ పరిశీలకులు భారతి లక్పతి నాయక్
చేగుంట: పక్కగా నామినేషన్ల ప్రక్రియ చేపట్టాలని, ఎన్నికల సంఘం నియమాలను పాటించాలని సాధారణ పరిశీలకులు భారతి లక్పతి నాయక్ అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల సాధారణ పరిశీలకులు భారతి లక్పతి నాయక్ బుధవారం నామినేషన్ స్వీకరణ కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించారు. రామాయంపేట, నార్సింగ్ మండల కేంద్రాల్లోనీ ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించారు. నామినేషన్ కేంద్రంలో నామినేషన్ విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి పలు సూచనలు చేశారు. రిజిస్టర్లు పరిశీలించారు.
ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకుని ఎన్నికల సామాగ్రిని పరిశీలించారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా నామినేషన్ల ప్రక్రియను నిర్వహించాలని, నామినేషన్ దరఖాస్తు ఫారాలు తీసుకున్న వారి వివరాలను కూడా రిజిస్టర్ లో నమోదు చేయాలని సూచించారు. దాఖలైన నామినేషన్లకు సంబంధించిన అఫిడవిట్ లను ఏ రోజుకు ఆ రోజు నోటీసు బోర్డులపై ప్రదర్శిస్తూ, జిల్లా కేంద్రానికి సకాలంలో రిపోర్టులు పంపించాలని అన్నారు.
ప్రతి నామినేషన్ సెంటర్ వద్ద హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని, నామపత్రాలు దాఖలు చేసే విషయంలో అభ్యర్థులకు అవసరమైన సహకారం అందించాలని సూచించారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను తు.చ తప్పకుండా పాటిస్తూ, ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియను నిర్వహించాలని అన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి పక్కాగా అమలయ్యేలా చూడాలన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా, పై అధికారులను సంప్రదించాలని సూచించారు.