మహిళల స్వావలంబనకు కృషి
హైదరాబాద్: టీపీసీసీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ పదవీ బాధ్యతల స్వీకరించారు. గాంధీభవన్ నిర్వహించిన ఈ కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు మాట్లాడుతూ... మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్నామని, మహిళల స్వావలంబనకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. అంతేకాకుండా మహిళల నాయకత్వంలో పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, మహిళల పేరు మీదుగానే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు టీపీసీసీ చీఫ్ గుర్తు చేశారు.
201-18 నుంచి బీఆర్ఎస్ హయంలో ఒక్క మహిళా మంత్రి లేరని, మహిళలను రాష్ట్రపతిగా, సీఎంలుగా చేసిన పార్టీ కాంగ్రెస్ అని ఆయన కొనియాడారు. ఇంట్లో కూర్చుంటామంటే రాజకీయాల్లో గెలవలేరని, కాంగ్రెస్ లో కష్టపడినవారికి కచ్చితంగా పదవులు వస్తాయన్నారు. మాజీ ఎమ్మెల్యే డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డారని, బీఆర్ఎస్ హయంలో డ్రగ్స్, గంజాయి విచ్చలవిడిగా దొరికేవి అని చెప్పారు. కేటీఆర్ పై అనుమానాలున్నాయని, ఆయన పరీక్షలకు సిద్ధం కావాలని, బీఆర్ఎస్ నేత డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడితే కేటీఆర్ మాపై ఆరోపణలు చేస్తున్నారని మహేష్ గౌడ్ మండిపడ్డారు. స్వాతంత్ర్య భారతదేశంలో తొలిసారి కులగణన చేసిన రాష్ట్రం తెలంగాణ అని టీపీసీసీ చీఫ్ పేర్కొన్నారు.




