calender_icon.png 10 June, 2025 | 10:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్చక, ఉద్యోగ సంక్షేమ నిధి ఏర్పాటు

10-06-2025 01:07:21 AM

- లబ్ధి పొందనున్న 13,700 మంది ఉద్యోగులు

- దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ

హైదరాబాద్, జూన్ 9 (విజయక్రాంతి): తెలంగాణలోని అన్ని ప్రముఖ దేవాలయాల్లో సుదీర్ఘ కాలంగా సేవలు అందిస్తున్న అర్చక, ఉద్యోగ సంక్షేమ ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు.

ఈ సంక్షేమ ట్రస్టు ద్వారా శాఖ పరిధిలో చిన్నస్థాయి నుంచి సహాయ కమీషనర్ స్థాయి వరకు సుమారు 13,700 మంది అర్చకులు, ఇతర ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుందని ఆమె అన్నారు. సోమవారం హైదరాబాద్‌లో మంత్రి కొండా సురేఖ అర్చక, ఉద్యోగ సంక్షేమ నిధి పోస్టరును రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ.. అర్చక, ఉద్యోగుల కోసం తమ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందన్నారు. మరణానంతరం లేదా రిటైర్మెంట్ తదనంతరం వీరికి గ్రాట్యూటీ ఇవ్వడం జరుగుతుందన్నారు.

ఈ నిధి ద్వారా ఉద్యోగులకు మెడికల్ రీయింబర్స్ మెంట్, వివాహ పథకం,  ఉపనయన పథకం, గృహ నిర్మాణ సహా ఇతర పథకాలు, విధులు నిర్వహించలేని వికలాంక ఉద్యోగులకు ఆర్థిక సహాయ పథకం అందజేస్తామన్నారు. ఈ పథకాల్లో రెగ్యులర్ అర్చకులు, ఇతర ఉద్యోగులకు మరణానంతరము లేదా రిటైర్మెంట్ తదనంతరం అందించే గ్రాట్యూటీని 4 లక్షల నుంచి 8 లక్షలకు పెంచినట్టు మంత్రి వివరించారు.

అకాల మరణం పొందిన వారి అంతిమ సంస్కారాల ఖర్చుల కోసం అందించే మొత్తాన్ని 20 వేల నుంచి 30 వేలకు పెంచినట్టు తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా అర్చకులు, దేవాదాయ శాఖ ఉద్యోగులకు లబ్ది జరుగుతుందని సురేఖ ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, డైరెక్టర్ వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. ఇక కొత్తగా మంత్రి వర్గంలో చేరిన వాకిటీ శ్రీహరి మంత్రి కొండా సురేఖను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్రీహరికి ఆమె శుభాకాంక్షలు తెలిపారు.