08-09-2025 12:52:01 AM
సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న రొమాంటిక్ డ్రామా ‘తెలుసు కదా’. రాశీఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ స్టులిస్ట్ నీరజా కోన దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్న నిర్మిస్తున్నారు. తాజాగా హీరోయిన్ రాశీఖన్నా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. షూటింగ్ స్పాట్లోని కొన్ని ఫొటోలను పంచుకుంది.
ఈ సందర్భంగా ‘తెలుసు కదా’ జర్నీ గురించి రాశీఖన్నా పోస్ట్ చేసిన విషయాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. “కెమెరాలు ఆగిపోయిన తర్వాత కూడా మరిచిపోలేని కథలు ఉంటాయి.. ‘తెలుసు కదా’ అలాంటి కథల్లో ఒకటి. అద్భుతమైన అనుభవాలన్నీ కలగలిసిన ప్రయాణం ఇది. ఈ ప్రయాణంలో నాతోపాటు నడిచిన అద్భుతమైన టీమ్కి కృతజ్ఞతలు.
మేము సృష్టించిన ఈ ప్రపంచంలోకి మీరు అడుగుపెట్టే రోజు కోసం ఎదురుచూస్తున్నాను. ఇది మీకు ఒక గొప్ప రైడ్గా ఉంటుంది” అని రాసుకొచ్చింది. ఈ చిత్రానికి థమన్ సంగీత సారథ్యం వహించగా, జ్ఞాన శేఖర్ వీఎస్ డీవోపీగా, నవీన్ నూలి ఎడిటర్గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్గా వ్యవహరించారు. ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 17న విడుదల కానుంది.